ఉన్నత విద్యలో అంతర్జాతీయ హబ్ దిశగా భారత్ - నరేంద్ర మోదీ
‘గత ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అది ఏదో ఒక రంగానికి మాత్రమే పరిమితమయ్యేది. ఇతర రంగాలను పక్కన పెట్టేవారు. కానీ, గత 6 నెలలుగా అన్ని రంగాల్లో మార్పులు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది’ అని మోదీ పేర్కొన్నారు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన నూతన విద్యా విధానం (NEP) విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నైపుణ్యాలపైనే దృష్టి సారించి యువతను అన్ని రంగాల్లో పోటీ పడేలా తీర్చిదిద్దేందుకు ఈ విధానం తోడ్పడుతుందని ఆయన అన్నారు. వ్యవసాయ రంగంలోనూ కొన్ని మార్పులు చేస్తూ వ్యవసాయ బిల్లులను తీసుకొచ్చామని ప్రధాని మోదీ చెప్పారు. అవి రైతుల సాధికారత కోసం దోహదం చేస్తాయని పేర్కొన్నారు. రైతులనే కాకుండా వ్యవసాయ కూలీలను కూడా అభివృద్ధి పథంలో నడిపించేందుకు సహకరిస్తాయన్నారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని మోదీ తెలిపారు.