నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. టీఎస్‌పీఎస్సీ కొత్త నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం భారీగా నియామకాలు జరపనున్న నేపథ్యంలో ఈసారి టీఎస్‌పీఎస్‌ పరీక్ష, నియామక విధానంలో అనేక మార్పులు చేయాలని నిర్ణయించింది. పరీక్షలు నిర్వహించి, ఇంటర్వ్యూలు పూర్తయ్యాక కూడా పోస్టులు మిగిలే అవకాశం లేకుండా చేయాలని నిర్ణయించింది. గతంలో అనుసరించిన విధానాల్లో మార్పులు చేయాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది. ఒకటికి మించి పోస్టులకు ఎంపికైనవారు తప్పనిసరిగా ఏదో ఒకటే ఖరారు చేసుకునే అవకాశం ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీ  భావిస్తోంది.


వారు గడువులోపు చేరకుంటే తదుపరి అర్హులైనవారికి అవకాశం ఇచ్చే ఆలోచనలో టీఎస్‌పీఎస్సీ ఉంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై టీఎస్‌పీఎస్సీ  కసరత్తు చేస్తోంది. తెలంగాణలో 80 వేల ఉద్యోగాల ఖాళీలను భర్తీచేస్తామని కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పోస్టులు మిగలకుండా వాటిని  అన్నింటినీ భర్తీ చేయాలని చూస్తోంది. అభ్యర్థులు గడువులోగా విధుల్లో చేరకపోతే వారిని వదిలేసి ప్రాధాన్య క్రమంలో మిగిలిన అర్హులకు అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తోంది.


ఉద్యోగాన్వేషణలో అభ్యర్థులు ఒకటికి మించి పోస్టులకు ప్రయత్నిస్తుంటారు. కొందరు రెండు, మూడు పోస్టులకు ఎంపికవుతుంటారు. చివరకు నచ్చిన పోస్టును ఎంచుకొని మిగిలినవి వదిలేస్తుడటంతో కొన్ని  ఖాళీగా ఉండిపోతున్నాయి. ఆశావహులైన నిరుద్యోగులు తర్వాతి నోటిఫికేషన్‌ వరకు ఉద్యోగాలు పొందలేకపోతున్నారు.

గతంలో వివిధ నియామకాల్లో ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగంలో చేరక చాలా పోస్టులు ఖాళీగా మిగిలేవి.వాటిని మిగులు పోస్టులుగా చూపి తదుపరి నోటిఫికేషన్‌ ఇచ్చినప్పుడే భర్తీ చేసే విధానం ఉండేది. ఒకటి మించి ఉద్యోగాలకు ఎంపికైన వారిని గుర్తించి వారు ఏపోస్టులో చేరాలనుకుంటున్నారో తెలుసుకుంటారు. వారు వదిలిపెట్టిన పోస్టులకు జాబితాలో ఉన్న తర్వాత అర్హులకు అవకాశం ఇస్తారు. ఉద్దేశపూర్వకంగా సమాధానం ఇవ్వకుంటే గడువులోగా నియామక ఉత్తర్వులు తీసుకోకుంటే వారికి ఏదో ఒకచోట పోస్టింగ్‌ ఖరారు చేస్తారు. మిగిలిన వాటి నుంచి మినహాయిస్తారు. కేరళ, తమిళనాడుల్లోనూ పోస్టులు మిగిలిపోకుండా అర్హుల జాబితాలోని తర్వాతి వారికి అవకాశమిచ్చే విధానం అమల్లో ఉంది. ఎలాగైనా సరే ఈసారి పోస్టులు మిగలకుండా చూడాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: