పంద్రాగస్ట్: రేవంత్ రాక కోసం ముస్తాబవుతున్న గోల్కొండ కోట..!

FARMANULLA SHAIK
తెలంగాణ ఏర్పడిన పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తనదైన పాలనతో ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే.సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో తమ మార్క్ చూపిస్తున్నారు. అయితే.. పదేళ్లు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు.. ప్రగతిభవన్‌ను ప్రజాభవన్‌గా, 'టీజీ'ని 'టీఎస్‌'గా మార్చటంతో పాటు రాష్ట్రంలో అమలవుతున్న పథకాల పేర్ల నుంచి మొదలు తెలంగాణ లోగో, తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర గీతంలో మార్పుల వరకు తనదైన మార్క్ ఉండేలా చూసుకుంటున్నారు. ఇన్ని మార్పులు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కొన్ని విషయాల్లో మాత్రం కేసీఆర్‌ను ఫాలో అవుతుండటం గమనార్హం..రాజరికపు పోకడలు అని చెబుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈసారి స్వాత్రంత్య సంబరాలను మాత్రం గోల్కొండ కోటలోనే నిర్వహించనుండడం విశేషం. ప్రభుత్వ అధికార చిహ్నం రాజరికపు చిహ్నం అని పేర్కొంటున్న ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు గోల్కొండ కోటలోనే స్వాతంత్ర్య సంబరాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం చర్చనీయాంశంగా మారింది. గోల్కొండ రాజరికపు చిహ్నం కాదా? అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే లోగోల మార్పు తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో ప్రభుత్వం యూటర్న్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. గోల్కొండలోనే ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంద్రాగస్టు వేడుకలను గోల్కొండ కోటపైనే ప్రారంభిస్తారు.
సీఎం హోదాలో ఆయన తొలిసారి గోల్కొండపై త్రివర్ణ పతాకం ఎగురవేయనున్నారు. అనంతరం అక్కడి నుంచి రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.ముఖ్యమంత్రి సహా, ప్రముఖులు గోల్కొండ కోటకు తరలిరానుండటంతో ఏర్పాట్లను సీఎస్ శాంతకుమారి సోమవారం పరిశీలించారు. అమెరికా పర్యటన ముగించుకుని వచ్చి గోల్కొండలో ఏర్పాట్లను ఆమె పర్యవేక్షించారు. వర్షం కురిస్తే.. వేడుకలకు హాజరయ్యేవారు తడవకుండా వాటర్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. వీఐపీలు రానున్న నేపథ్యంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా బందోబస్తు, ట్రాఫిక్ ఏర్పాట్లు, పార్కింగ్ పై దృష్టి సారించాలని పోలీసులను ఆమె ఆదేశించారు.ఓ వైపు సీఎస్ ఆదేశాలతో అధికారులు పరుగులు పెడుతుంటే.. అదే స్థాయిలో గోల్కొండ కోట ముస్తాబవుతోంది. ఏటా రాష్ట్ర ప్రభుత్వం గోల్కొండలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. జెండా వందనం చేసేందుకు ముఖ్యమంత్రి, మంత్రులు రానున్న నేపథ్యంలో అనేక భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రముఖుల ముందు నిర్వహించే పరేడ్‌కి సంబంధించి రిహార్సల్స్ కూడా జరుగుతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు, ఈ పరేడ్ స్వాతంత్ర్య వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.తెలంగాణ ఆవిర్భావం నుంచి 2023 స్వాతంత్ర్య వేడుకల వరకు మాజీ సీఎం కేసీఆరే గోల్కొండపై జెండా ఎగురవేసేవారు. కాగా.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తొలిసారి జెండా పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: