హైదరాబాద్ నగరంలో పారిశుధ్య కార్యక్రమాల అమలు, సీజనల్ వ్యాధుల నివారణ చర్యలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. జిహెచ్ఎంసి ద్వారా అమలవుతున్న పలు కార్యక్రమాల నిర్వహణ పై గ్రేటర్ లోని పలు ప్రాంతాల్లో జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్లు, విభాగాధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అడిషనల్ కమిషనర్లు శృతిఓజా, సందీప్ జా, అద్వైత్ కుమార్ సింగ్, సిక్తాపట్నాయక్, జయరాజ్ కెనడిలతో పాటు జోనల్, డిప్యూటి కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటించారు. సీజనల్ వ్యాధులను కలిగించే శానిటేషన్ కార్యక్రమాలు, దోమల నివారణ, లార్వా ఉత్పత్తికి కారణమయ్యే నీటి నిల్వల తొలగింపు, ఇంటింటి నుండి గార్బేజ్ ను సేకరించడం, వందశాతం నివాసితులు చెత్తను స్వచ్ఛ ఆటోలకు అందించడం, తడి, పొడి చెత్తగా విడదీసి అందించడం, నీటిని వృథా చేయకపోవడం, ప్లాస్టిక్ నిషేదం, బహిరంగ స్థలాల్లోల చెత్తను వేయకుండా నిరోధించడం తదితర అంశాల లక్ష్యంగా ఈ క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టారు.
ఆసిఫ్ నగర్, విజయనగర్ కాలనీలలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణను అడిషనల్ కమిషనర్ అద్వైత్ కుమార్ సింగ్ తనిఖీ చేశారు. ఆరు గంటలకే ఆసీఫ్ నగర్ ప్రాంతానికి చేరుకొని బయోమెట్రిక్ హాజరును పరిశీలించి, రెడ్ హిల్స్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, విజయనగర్ కాలనీ స్విమ్మింగ్ పూల్ ల నిర్వహణను తనిఖీ చేశారు. మెహిదీపట్నం సర్కిల్ లోని శాంతినగర్, మల్లేపల్లి, విజయనగర్ ప్రాంతాల్లో శానిటేషన్ పై తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా మల్లేపల్లిలోని సెయింట్ ఆన్స్ పాఠశాల, నైస్ హై స్కూల్, అన్వర్ ఉల్ ఉన్ కళాశాలల్లో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణను పరిశీలించారు. ముఖ్యంగా దోమల నివారణకుగాను నీటి నిల్వల తొలగింపు తదితర కార్యక్రమాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఎంటమాలజి సిబ్బందితో కలిసి ఈ పాఠశాలలో స్ప్రేయింగ్, నీటి నిల్వలను తొలగించారు. అంబర్ పేట్ సర్కిల్ లోని నారాయణగూడ, హైదర్ గూడ, చిక్కడపల్లి, గాంధీ నగర్ తదితర ప్రాంతాల్లో అడిషనల్ కమిషనర్ సిక్తాపట్నాయక్ పర్యటించి పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణను పరిశీలించారు.
అంతర్గత రోడ్లపై పేరుకుపోయిన గార్బేజ్ ను వెంటనే తొలగించాలని, బస్తీలు, స్లమ్ లలో యాంటి లార్వా ఆపరరేషన్లను విస్తృతంగా నిర్వహించాలని క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. బేగంపేట్ మహర్షి విద్యాలయంలో డెంగ్యు నివారణ పై నిర్వహించిన అవగాహన సదస్సులో సిక్తాపట్నాయక్ పాల్గొన్నారు. కిషన్బాగ్, నంది ముస్లాయిగూడ, పురానాపూల్, పత్తర్గట్టి తదితర ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణపై క్షేత్రస్థాయిలో అడిషనల్ కమిషనర్ సందీప్ జా పరిశీలించారు. ముఖ్యంగా పలు బస్తీల్లో పర్యటించిన అడిషనల్ కమిషనర్ ఖాళీ స్థలంలో పరిసర ప్రాంతాల నివాసితులు చెత్త వేయడం ద్వారా గార్బేజ్ పాయింట్గా మారడాన్ని గమనించారు.స్థానిక మహిళలు, యువకులు, సీనియర్ సిటీజన్లు ప్రత్యేకంగా స్వచ్ఛ కమిటీలను ఏర్పాటుచేసుకొని బహిరంగంగా చెత్తను వేయకుండా నివారించడానికి బస్తీవాసులను చైతన్యపర్చాలని, ఇందుకుగాను ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సందీప్ జా స్థానికులకు విజ్జప్తి చేశారు.
కాప్రా సర్కిల్ లోని చర్లపల్లి కుషాయిగూడ, మౌలాలిలలో శానిటేషన్ కార్యక్రమాల నిర్వహణను అడిషనల్ కమిషనర్ జయరాజ్ కెనడి తనిఖీ నిర్వహించారు. చక్రిపురంలో హరితహారంలో భాగంగా ఏర్పాటుచేసిన గ్రీన్ బెల్ట్ ప్లాంటేషన్ నిర్వహణను కెనడి పరిశీలించారు. ఎంటమాలజి సిబ్బంది చేపట్టిన స్ప్రేయింగ్, ఫాగింగ్ లను తనిఖీ చేశారు. వీరితో పాటు జోనల్ కమిషనర్లు నేడు తమ ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ పై తనిఖీలు నిర్వహించడంతో పాటు డెంగ్యు కేసులు నమోదైన ఇళ్లకు వ్యక్తిగతంగా వెళ్లి దోమల ఉత్పత్తి ప్రాంతాలు, నీటి నిల్వలు ఉండే గుంతలు, పాత్రల్లో నీటిని తొలగించారు. జోనల్ కమిషనర్లు ముషారఫ్ అలీ, ఎస్. శ్రీనివాస్ రెడ్డి, శంకరయ్య, శ్రీనివాస్ రెడ్డి, మమతలు తమ ప్రాంతాల్లో విస్తృతస్థాయిలో తనిఖీలు నిర్వహించారు.
స్థానిక మహిళలు, యువకులు, సీనియర్ సిటీజన్లు ప్రత్యేకంగా స్వచ్ఛ కమిటీలను ఏర్పాటుచేసుకొని బహిరంగంగా చెత్తను వేయకుండా నివారించడానికి బస్తీవాసులను చైతన్యపర్చాలని, ఇందుకుగాను ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సందీప్ జా స్థానికులకు విజ్జప్తి చేశారు.