తెలంగాణ ఉద్యోగులకు కరోనా చికిత్స నిమిత్తం రూ.లక్ష రీయింబర్స్ మెంట్
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఓ శుభవార్త తెలిపింది. ఇప్పటికే ఈ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అనేకమంది చనిపోయారనే విషయం తెలిసిందే. అయితే చాలామంది కరోనా చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు పెట్టారు. అంతేకాకుండా లక్షల రూపాయలు ఫీజులు కట్టి కోవిడ్ భయంతో చికిత్స చేయించుకున్నారు. అయితే ఇప్పుడు అలాంటి వారందరికీ కేసీఆర్ సర్కార్ ఓ గుడ్ న్యూస్ తెలిపింది. కరోనా వ్యాధికి అత్యవసర చికిత్స పొందే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారికి రూ. లక్ష వరకు మెడికల్ రీయింబర్స్మెంట్ అందివ్వనుంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ తాజాగా దీనికి సంబంధించిన మెమో జారీ చేశారు. హోంశాఖ వివరణ కోరడంతో ఈ మెమో ఇవ్వడం గమనార్హం. ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందినవారికి గరిష్టంగా రూ.లక్ష వరకు రీయింబర్స్మెంట్ చెల్లింపు సౌకర్యం ఉంటుందన్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్)లో ఈ వసతి లేకపోవడంతో అనేకమంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ విరమణ పొందినవారు 25 లక్షల మంది ఉంటారు. తాజా నిర్ణయం లక్షలాది మందికి ప్రయోజనం కలిగిస్తుందని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయం పట్ల ఉద్యోగులు... వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.