మొలకలు ఎలా తయారు చేయాలో తెలుసా..? ఇక వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మరి..!
ప్రతి ఒక్కరూ అంటూనే ఉంటారు.. మొలకెత్తిన గింజలు తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది తద్వారా జబ్బుల బారిన పడకుండా ఉండవచ్చు అని.. పూర్వకాలంలో ఏదైనా పండుగ వచ్చిందంటే చాలు ధాన్యాలను మొలకెత్తించి, ముఖ్యంగా దేవతలకు ప్రసాదంగా పెట్టేవారు. అంతేకాకుండా మరీ ముఖ్యంగా శ్రావణ మాసం వచ్చిందంటే సజ్జల ను మొలకెత్తించి, నాగదేవతకు ప్రసాదంగా సమర్పిస్తారు. ఆ తరువాత ఇంటిల్లిపాది తో పాటు చుట్టుపక్కల వారు కూడా ఈ ప్రసాదాన్ని సేవిస్తారు. అయితే ఇక్కడ దేవుడు ప్రసాదించే వరం ఏమో కానీ ఈ మొలకెత్తినగింజలు తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు అనేది వాస్తవం. అయితే ప్రస్తుతం చాలామందికి ఈ గింజల్ని ఎలా మొలకెత్తించాలో తెలియక మార్కెట్లో దొరికే మొలకెత్తిన గింజలను కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే వాటిని ఎలా మొలకెత్తించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మీరు ఏవైతే ధాన్యాలను మొలకెత్తించాలి అనుకుంటున్నారో వాటిని ఎనిమిది నుంచి పది గంటల పాటు నీటిలో నానబెట్టాలి. ఆ తరువాత వాటి నుండి నీటిని తీసివేసి శుభ్రమైన వస్త్రంలో ఉంచి, చుట్టి ముడి వేయాలి. ఇక 24 గంటల నుండి 48 గంటల లోపు మొలకలు తయారవుతాయి. అయితే మనం ఎంచుకునే గింజలను బట్టి అవి ఏర్పడతాయి. సజ్జలు, పెసలు అయితే 24 గంటల లోపు మొలకలు రావడం ప్రారంభమవుతాయి.
ఇక వీటి వల్ల లాభాలు ఏమిటంటే.. అనేక పోషకాల సమ్మేళనాలు సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా ప్రోటీన్లు, ఫోలేట్,మెగ్నీషియం, ఫాస్ఫరస్, మాంగనీస్, విటమిన్ సి, విటమిన్ కె వంటివి మొలకల ద్వారా మనకు లభిస్తాయి. వీటిని తినడం వల్ల శరీరానికి కావలసిన పోషణ, శక్తి రెండూ అందుతాయి. డయాబెటిస్ తో బాధపడుతున్న వారు ఈ మొలకెత్తిన గింజలు తినడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
వీటిలో ఉండే ఫైబర్ కారణంగా ఆకలి నియంత్రణలో ఉంటుంది. కాబట్టి అధిక బరువుతో బాధపడుతున్న వారు వీటిని పుష్కలంగా తినవచ్చు. అంతే కాకుండా ఆరోగ్యంగా ఉండడానికి ఎంతగానో సహాయపడతాయి . హార్ట్ ఎటాక్ వంటి జబ్బులు కూడా రాకుండా ఉంటాయి..