మార్పులను ముందే పసిగట్టాడు.
ఊహించలోపే అద్భుతాలు చూపించాడు.
మొబైల్ రంగంలో సునామీ సృష్టించాడు.
దిగ్గజాలను ఈజీగా దాటేశాడు.
ఆకాశాన్నంటే అంచనాలు పెట్టుకున్నాడు. చకచకా ఎక్కేస్తున్నాడు.
అతడే షియామి కంపెనీ అధినేత లెయ్ జున్.
చైనాలో నంబర్ వన్ మొబైల్ కంపెనీగా మార్చి, ఇండియాలో అదే దిశగా మార్చడంలో లెయ్ జున్ వడివడిగా అడుగులేస్తున్నాడు.
చైనాలోని వుహాన్ సిటీలో పుట్టి పెరిగిన లెయ్ జున్... వుహాన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్లో ఇంజినీరింగ్ చేశాడు. అక్కడ ఉన్నపుడే పర్సనల్ కంప్యూటర్ తొలినాళ్ల గురించి వివరించే ‘ఫైర్ ఇన్ ద వ్యాలీ’ పుస్తకాన్ని చదివి స్ఫూర్తి పొందాడు. ఇక చూడ్డానికి ఐఫోన్ల మాదిరిగానే ఉండే ఎమ్ఐ ఫోన్లకు శ్రీకారంచుట్టాడు. మైక్రోసాఫ్ట్, గూగుల్లలో ఇంజినీర్గా చేసిన బిన్ లిన్తో కలిసి 2010లో బీజింగ్ కేంద్రంగా షియామీని ప్రారంభించాడు జున్. అందరూ మొబైల్ని మొబైల్గానే చూస్తున్న దశలో వాటిని పీసీలో ఉండే సౌకర్యాలతో తెచ్చింది షియామీ. 2011 ఆగస్టులో చైనాలో వీరి ఎమ్ఐ-1 ఫోన్లు వచ్చిన రెండ్రోజుల్లోనే అమ్ముడైపోయాయి. 2012లో విడుదలైన ఎమ్ఐ-2 కూడా అలాంటి సంచలనమే సృష్టించింది. ఆన్లైన్లో మాత్రమే అమ్మడంద్వారా పోటీ సంస్థల ఉత్పత్తులు ఐఫోన్, గెలాక్సీ ఫోన్లతో పోల్చితే సగం ధరకే అందించిందీ సంస్థ. మూడేళ్లలో 4 బిలియన్ డాలర్ల కంపెనీ స్థాయికి వెళ్లింది.
స్మార్ట్ఫోన్ని వినియోగించాలన్న కోరిక ఉండి, చేతిలో డబ్బు అంతంత మాత్రంగా ఉండే యువతనే లక్ష్యంగా చేసుకుంది షియామి. అందుబాటు ధరలోనే నాణ్యమైన ఫోన్లను అందించింది. ఆపిల్, శామ్సంగ్ ఎక్కడ, షియామీ ఎక్కడ?... ఇలా అన్నవారంతా చూస్తుండగానే షియామీ చైనా మార్కెట్కి రారాజైంది. 2014లో భారత్లో అడుగుపెట్టింది. ఇక్కడి మార్కెట్లో 2015లో ఉన్న మూడు శాతం వాటా నుంచి ఇప్పుడు 24 శాతానికి వెళ్లింది.
ప్రస్తుతానికి శామ్సంగ్, షియామీ-ఎమ్ఐ... సమాన వాటాతో భారతీయ మార్కెట్లో నంబర్వన్ స్థానంలో ఉన్నాయి. మొత్తంగా ప్రపంచ మార్కెట్లో అయిదో స్థానంలో ఉంది షియామి. ఈ దూకుడు ఎక్కడి వరకూ అని జున్ని అడిగితే షియామీని చౌకైన స్మార్ట్ఫోన్ల చైనా కంపెనీగా కాకుండా, ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఒకటిగా తీర్చిదిద్దాలనేది నా టార్గెట్ అని చెబుతాడు. షియామీ ప్రచారకర్తలుగా సినీతారలూ, క్రికెటర్లూ కనిపించరు. టీవీలో ఆ సంస్థ ప్రకటనలూ ఉండవు. వినియోగదారుల్నే ప్రచారకర్తలుగా మల్చుకునే ట్రెండ్ను సృష్టించాడు లెయ్ జున్. తన బిజినెస్ దూకుడుతో ఈ తరం యూత్కు తిరుగులేని సక్సెస్ పాఠాలు నేర్పుతున్నాడు.
ఏదేమైనా ఈ వైఫై యుగంలో స్టార్టప్ కంపెనీలకు ఎన్నో పాఠాలు నేర్పుతున్నాడు ఎమ్ఐ అధినేత లెయ్ జున్.