రెండు తలల పామును రూ.13 లక్షలకు అమ్మాలనుకున్నారు.. చివరకు ఏమైందంటే..?
పాము పేరెత్తితే చాలు ఎవరికైనా గుండె గుబేల్ మనాల్సిందే. అలాంటిది పామును చూస్తే అయ్యబాబోయ్ అంటూ ఇక్కడున్న వారు కూడా అంత దూరం పరుగులు తీస్తారు. కొందరైతే పాము కనిపిస్తే చాలు అది ఎక్కడ వారిపై దాడి చేస్తుందో అని ముందే దాన్ని కొట్టి చంపేస్తారు. పాములు ఎవరినీ కావాలని పనికట్టుకుని వచ్చి కాటేయవు. వాటికి ఎక్కడ హాని కలుగుతుందో అని తొందరపడి కాటేస్తుంది. మరికొందరు పామును కొట్టినపుడు అది తప్పించుకుని పగబడతాయని అనుకుంటారు. కాని పాముకు ఎలాంటి పగలు ప్రతీకారాలు వుండవు. ఇవన్నీ పక్కన పెడితే మీరేప్పుడైనా రెండు తలల పామును చూశారా..?
ఇవి చాలా అరుదు.. ఖరీదైనవి కూడా. ఇటువంటి రెండు తలల పాములు స్మగ్లర్లకు కాసుల పంటపండిస్తాయి. కొన్ని సందర్భాల్లో రెండు తలల పాము ఖరీదు, లక్షలు దాటి కోట్లు కూడా పలుకుతుందంటే అర్థం చేసుకోవచ్చు ఈ రకం పాములకు ఎంత డిమాండ్ ఉందో. ఇక తాజాగా అమ్మకానికి ఉంచిన ఈ పామును కొనుగోలుదారునికి అప్పగించేందుకు ప్రయాణిస్తున్న ముఠాను పోలీసులు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద నిఘావేసి పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన అసత్, ముజాయిద్, ఖదీర్ వద్ద ఓ రెండు తలలపాము ఉంది.
దీన్ని హైదరాబాద్ కు చెందిన వ్యక్తికి అమ్మేందుకు రూ.13 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం పామును అప్పగించేందుకు వస్తుండగా విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ఓఎన్టీ పోలీసులు బీజాపూర్ రహదారి పై కాపుకాసారు. ఈ క్రమంలోనే చేవెళ్ల పట్టణంలోని ఓ దాబాకు వచ్చిన నిందితులను పట్టుకుని పామును స్వాధీనం చేసుకున్నారు.