కరోనా మహమ్మారి కారణంగా రెండు దశాబ్దాల పురోగతికి ముప్పు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది. మరీ ముఖ్యంగా యూనివర్సల్ హెల్త్ కవరేజి పురోగతిపై తీవ్ర ప్రభావం చూపి.. దాని పురోగతిని దెబ్బతీసే అవకాశం ఉందని తెలిపింది. ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు ప్రస్తావించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి. వైద్య సేవల కోసం సొంతగా ఖర్చు పెట్టాల్సి రావడం తో 50 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలు తీవ్ర పేదరికంలోకి జారుకున్నారు. కరోనా పంజా తర్వాత పరిస్థితుల నుంచి తిరిగి పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్న దేశాలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.
ఇక సమయం లేదని, ప్రపంచదేశాలన్నీ వెంటనే స్పందించాలని పేర్కొంది. పేదరికం పెరగడం, ఆదాయాలు తగ్గడం, ప్రభుత్వాలు కఠినమైన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటున్నందున.. ఈ ఆర్థిక కష్టాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఈ రెండు అంతర్జాతీయ సంస్థల నివేదికలు హెచ్చరించాయి. కోవిడ్ మహమ్మారి కి ముందే దాదాపు 100 కోట్ల మంది తమ ఆదాయంలో 10%కి పైగా ఆరోగ్యానికి ఖర్చు చేస్తున్నారు.ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.దీనివల్ల పేదలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఆర్థిక పరిస్థితుల మధ్య ప్రభుత్వాలు వైద్య సేవల వ్యయన్ని పెంచేందుకు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ప్రపంచ బ్యాంకుకు చెందిన జూవాన్ ఉరిబే వెల్లడించారు. మహమ్మారి కి ముందు 68 శాతం మందికి అత్యవసర వైద్య సేవలు అందేవని చెప్పారు.
ఏమాత్రం సమయం లేదు. ప్రపంచ దేశాలు తమ పౌరులంతా ఆర్థిక పరిణామాలకు భయపడకుండా ఆరోగ్య సేవలను పొందగలరని నిర్ధారించే ప్రయత్నాలను వెంటనే తిరిగి ప్రారంభించాలి. వాటిని వేగవంతం చేయాలి. వైద్య సేవల పై ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం కీలకం. ఈసారి భవిష్యత్తులో ఎదురయ్యే మహమ్మారులను తట్టుకునేలా వ్యవస్థల్ని నిర్మించాలి. అలాగే యూనివర్సల్ హెల్త్ కవరేజి దిశగా నిర్ణయం తీసుకోవాలని ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనాం సూచించారు. పేదలు వైద్యం కోసం డబ్బులు వెచ్చించ్చే పరిస్థితి నుంచి వారిని మినహాయించాల్సి ఉందని ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అందుకోసం పేద, బలహీన వర్గాలకు సేవలు అందించేలా పథకాలు రూపొందించాలని సూచించింది.