సమస్య వచ్చింది. దానికి పరిష్కారాలు ఎన్నో ఉంటాయి. కానీ కోట్లాది మందికి ఓ సరైన 'దారి' చూపిస్తూ, వందల కోట్లు సంపాదించే ఐడియాను అమల్లో పెట్టేస్తే ఎలా ఉంటుంది! అద్భుతం కదూ! అదే చేశాడు నిజామాబాద్కు చెందిన కుర్రాడు. తను ఎదుర్కొన్న సమస్యకు చెక్ పెట్టేందుకు ఓ ఆలోచన చేశాడు.. అంతే వందల కోట్లు అందుకున్నాడు. రెడ్బస్ ప్రయాణంలో ఫణీంద్ర సామా సక్సెస్ స్టోరీ మీ కోసం.
ఎర్రబస్సు .. ఈ పదం ఒకప్పుడు మన ఊర్లలో బాగా ఫేమస్. ఇప్పుడు రెడ్ బస్సు కూడా అంతకంటే పాపులర్ అయింది. దేశీయ స్టార్టప్ కంపెనీల్లో రెడ్బస్ది తిరుగులేని చరిత్ర అని చెప్పొచ్చు. దేశంలో ప్రధాన నగరాలకు ప్రయాణించేందుకు ఇప్పటికీ ఎక్కువ మంది ప్రిఫర్ చేసే ప్రయాణ సాధనం బస్సు. అయితే ఒకప్పుడు ఆర్టీసీ కాకుండా ప్రైవేటు బస్సుల్లో వెళ్లాంటే చాలా ప్రయాస ఉండేది. పండగలు వస్తే ఇంకా ఇబ్బందే. ఇలా బస్సు ప్రయాణంలో ఇబ్బందులకు పరిష్కారం చేశాడు ఫణీంద్ర సామా అనే కుర్రాడు. రెడ్బస్ పేరుతో ఓ స్టార్టప్ తయారు చేశాడు. ఇప్పుడు ప్రభుత్వ, ప్రైవేటు బస్సు అనే బేధం లేకుండా.. ప్రతి మార్గంలోనూ తిరిగే బస్సులన్నింటితోనూ అనుసంధానం ఏర్పరస్తూ ప్రజల ప్రయాణాన్ని చాలా సులువు చేసింది.
ఈ స్టార్టప్ సక్సెస్ అంత ఈజీగా జరగలేదు. ఏదో ఒకటి చేయాలన్న కోరికే రెడ్ బస్ను ఆ స్థాయికి తీసుకెళ్లింది. ముగ్గురు యువకుల కృషి, తపన కలగలిసి బస్సు ప్రయాణాల నిర్వహణ ద్వారా పెద్దఎత్తున వ్యాపారాలు చేయవచ్చని నిరూపించబడింది. ప్రారంభంలో 300 టికెట్ల నుంచి నెలకు 3 లక్షల టికెట్లు, 600 కోట్ల రూపాయలకు పైగా వ్యాపారం.. వందల మంది ఉద్యోగులు.. వంటి సంఖ్యలు వినడానికి హాయిగా ఉన్నా దాని వెనుక వాళ్లు పడిన కష్టం ఎంతో ఉంది. ప్రారంభం నుంచి ఎన్నో సవాళ్లు విజయవంతంగా ఎదుర్కొని నిలిచి గెలిచిన స్టార్టప్ ఇది.
అది 2005 దివాళీ సీజన్.. ఫణీంద్ర ఊరెళ్దామంటే, విపరీతమైన రష్ కారణంగా టికెట్లు దొరకలేదు. నిర్వహణ సరిగా లేకపోవడం వల్లే ఇలా టికెట్లకు ఇబ్బంది పడాల్సి వచ్చిందని ఫణీంద్ర గ్రహించారు. ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్న మిత్రుడితో తన అనుభవాలను పంచుకొన్నాడు ఫణీంద్ర. బిట్స్ పిలానీలో చదువుకుని ఒకే ఫ్లాట్లో ఉంటున్న వీరిద్దరూ కలిసి రెడ్బస్ను ప్రారంభించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్కు బస్సులో వచ్చే ప్రయత్నంలో పుట్టిన ఆలోచనకు పదును పెట్టి దానికి ప్రాణం పోసి దీన్ని కూడా ఓ అద్భుత వ్యాపార అవకాశంగా మార్చిన వాళ్ల ఐడియాకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే... !
కొన్నేళ్ల తర్వాత.. అంటే రెండేళ్ల క్రితం నెస్పర్స్ ఐబిబో రెడ్బస్ను 800 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. ఓ టికెట్ బుకింగ్ కంపెనీని అంత సులువుగా ఐబిబో సంస్థ ఆబగా కొనేయలేదు. అందులో ఎంతో విలువను చూసింది. ఇదే అన్ని వందల కోట్లు పెట్టి మరీ సంస్థను కొనేలా చేసింది.
ప్రైవేట్, ఆర్టీసీ అనే బేధం లేకుండా.. రాష్ట్రమూ, రూటుతో సంబంధం లేకుండా.. బస్ ప్రయాణించగలిగే ప్రతీ మార్గంలోనూ తనదైన ముద్రవేసుకుంది ఈ రెడ్ బస్. ఆరేడేళ్లుగా కొన్ని లక్షల మందికి సేవలు అందిస్తూ బస్ టికెటింగ్ రంగానికే ఒక దిక్సూచిలా మారింది. ఆన్ లైన్ను ప్రజలు నమ్ముతారా, ఇది సక్సెస్ అవుతుందా అని జనాలు ఆలోచిస్తున్న ఆ రోజుల్లోనే భవిష్యత్తుపై భరోసాతో మొదలైన సంస్థ రెడ్ బస్. అలాంటి కంపెనీని తెలుగువాళ్లు ప్రారంభించారని మనం ఘనంగా చెప్పుకోవచ్చు. గొప్ప స్ఫూర్తి పొందొచ్చు.