హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: స్పీకర్‌కు బామ్మర్ది దెబ్బ వేస్తారా?

తమ్మినేని సీతారాం...ఏపీ రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్ సృష్టించిన స్పీకర్. సాధారణంగా స్పీకర్లు రాజకీయాల్లో వేలు పెట్టరు. ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేయరు. కోడెల శివప్రసాద్ టైమ్ వరకు స్పీకర్లు ఇలాగే నడిచారు. కానీ ఇప్పుడు స్పీకర్‌గా ఉన్న తమ్మినేని శైలి వేరు. అసెంబ్లీలో స్పీకర్ పాత్ర సమర్ధవంతంగా నిర్వహిస్తూనే, తన నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాత్రలోకి వెళ్ళిపోయి, ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రతిపక్ష టీడీపీపై విరుచుకుపడుతుంటారు.

అయితే ఎమ్మెల్యేగా సీతారాం పనితీరు ఎలా ఉందటే?పర్వాలేదనే చెప్పాలి. అయితే ఎమ్మెల్యేగా పనిచేయడం తమ్మినేనికి ఇదేం తొలిసారి కాదు. టీడీపీలో రాజకీయ జీవితం మొదలుపెట్టిన తమ్మినేని… 1983లో ఆమదాలవలస నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అలాగే 1985 లో కూడా అదే స్థానం నుంచి గెలిచారు. ఇక 1989 లో ఓడిపోయినా... 1991 ఉపఎన్నికలో మళ్ళీ విజయం సాధించారు.

ఆ తర్వాత 1994, 1999 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించి చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేసారు.
ఇక 2004 లో ఓడిపోయిన తమ్మినేని...2009లో ప్రజారాజ్యంలోకి వెళ్లి అదే స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నెక్స్ట్ వైసీపీలోకి వెళ్లి 2014 ఎన్నికల్లో తన సొంత బామ్మర్ది కూన రవికుమార్ చేతిలో ఓడిపోయారు. ఓటమి ఎదురైనా తమ్మినేని ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా పని చేసుకుంటూ వచ్చి...2019 ఎన్నికల్లో విజయం సాధించి, ఏపీ స్పీకర్ స్థానంలో కూర్చున్నారు.

ఓ వైపు స్పీకర్‌గా పనిచేస్తూనే, మరోవైపు ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో మంచిగా పనిచేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. పార్టీని కూడా బలోపేతం చేస్తూ దూసుకెళుతున్నారు. ఇదే సమయంలో ఆమదాలవలసలో టీడీపీని తమ్మినేని బామ్మర్ది కూన రవికుమార్ నడిపిస్తున్నారు. అయితే తమ్మినేనికి...కూన బామ్మర్ది/మేనల్లుడు ఇలా రెండు వరుసలు అవుతాడు. తమ్మినేని వాళ్ళ భార్య తమ్ముడు కూన. అలాగే తమ్మినేని వాళ్ళ అక్క కొడుకు కూన.

ఇక వరుసలు విషయం పక్కనబెడితే కూన, తమ్మినేని గట్టి పోటీనే ఇస్తున్నాడు. నియోజకవర్గంలో యాక్టివ్ గా పని చేస్తున్నారు. కార్యకర్తలని కలుపుకుని పోతూ...వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. కేసులు ఎదురైనా ఏ మాత్రం తగ్గకుండా పనిచేస్తున్నారు. అయితే ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉండటంతో తమ్మినేనికి తిరుగులేకుండా ఉంది. పంచాయితీ ఎన్నికల్లో వైసీపీకి మెజారిటీ స్థానాలు దక్కే అవకాశముంది. నియోజకవర్గంలో ఆమదాలవలస, పొందూరు, సరుబుజ్జిలి, బూర్జ మండలాలు ఉన్నాయి. మెజారిటీ మండలాల్లో వైసీపీకి బలం ఉంది. మొత్తానికైతే స్పీకర్‌కు కూన చెక్ పెట్టలేకపోవచ్చనే చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: