మా కొడుకుల పెళ్లి గురించి ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ చెబుతా...!!

Shyam Rao
తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరో గా పేరుగాంచిన యువసామ్రాట్ నాగార్జున తనయుల ప్రేమ వివాహం గురించి టాలీవుడ్ మొత్తం కోడై కూస్తోన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇటీవల నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య, తెలుగు సినీ పరిశ్రమను ఏలుతున్న అగ్ర తార సమంత ఇద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని మీడియా లో అనేక గాసిప్స్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సస్పెన్స్ కి తెర దించేలా నాగార్జున ఈ విషయాన్ని మీడియా కు తెలియజేశారు.  



తన కుమారులు నాగచైతన్య, అఖిల్ ల వివాహంపై టాలీవుడ్ అగ్రనటుడు నాగార్జున తాజాగా స్పందించారు. తనయుల వివాహాలపై త్వరలో ఒక ప్రకటన చేస్తానని ఆయన అన్నారు. మంచి ముహూర్తం చూసుకుని, వారి వివాహాల వివరాలు తెలియజేస్తానని నాగార్జున తెలిపారు. చైతన్య, అఖిల్ ఇద్దరూ వారి జీవిత భాగస్వాములను ఎన్నుకోవడం తనకు, భార్య అమలకు చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్న సంగతి తెలిసిందే. 



సోమవారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో నాగార్జున మాట్లాడారు. తనయుల పెళ్లి విషయం గురించి ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ చెబుతానని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అక్టోబర్‌లో నాగచైతన్య-కల్యాణ్‌కృష్ణ.. అఖిల్‌-విక్రమ్‌కుమార్‌ల కాంబినేషన్‌లో చిత్రాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. తనకు ‘నిన్నేపెళ్లాడతా’ చిత్రమంటే చాలా ఇష్టమని, అలాంటి స్క్రిప్ట్‌నే కల్యాణ్‌కృష్ణ తయారు చేశారని, చైతన్య ఆ చిత్రం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇందుకు కల్యాణ్‌కృష్ణకు ధన్యవాదాలు తెలిపారు.



అక్టోబర్‌ చివరినాటికి ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రీకరణ దాదాపు పూర్తవుతుందని.. సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. ఇక ‘సోగ్గాడే-2 బంగార్రాజు’ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభమవుతుందని నాగార్జున స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: