ట్రిపుల్ ఆర్ విషయంలో సీఎం గ్రీన్ సిగ్నల్ ఇస్తారా..?
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న సినిమా ఇది. నందమూరి, కొణిదెల హీరోలు తొలిసారి కలిసి చేసిన ఈ సినిమా కోసం దానయ్య 450 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టాడు. దీంతో థియేట్రికల్ బిజినెస్ 500 కోట్లకి పైగా జరిగితేనే నిర్మాత సేఫ్ అవుతాడు. కానీ ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్లు తగ్గించడంతో అక్కడ థియేట్రికల్ రైట్స్ని తక్కువకి అడుగుతున్నారు బయ్యర్లు.
ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు పెరగకపోతే 'ఆర్ ఆర్ ఆర్' నిర్మాతలు భారీ నష్టాల్లో మునిగే ప్రమాదముంది. అందుకే ఏపీలో టికెట్ రేట్లు పెంచాలంటూ దానయ్య కోర్టుకెళ్తున్నాడనే ప్రచారం మొదలైంది. అయితే దానయ్య మాత్రం పోరాటాలు లాంటివి చేయడం లేదనీ.. మరోసారి ఏపీ సీయం జగన్మోహన్ రెడ్డిని కలిసి సమస్యని విన్నావిస్తానని చెబుతున్నాడు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో ఢీకొడుతోన్న టీడీపీ, జనసేన పార్టీలకి చెందిన హీరోలు 'ఆర్ ఆర్ ఆర్' సినిమా చేశారు. టీడీపికి జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో ప్రచారం చేస్తే, రామ్ చరణ్ జనసేనాని పవన్ కళ్యాణ్కి మద్దతు పలికాడు. మరి ఏపి ప్రభుత్వంతో ఫైట్ చేస్తోన్న ఈ రెండు పార్టీలకి చెందిన స్టార్స్ సినిమాకి అనుకూలమైన జీవో వస్తుందా లేదా అనేది పరిశ్రమ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. చూద్దాం... అసలు ఏం జరుగుతుందో.