డబ్బే డబ్బు : కాల్ లెటర్లు ఇచ్చినా ఉద్యోగాలు లేవు !

Seetha Sailaja
కరోనా పరిస్థితుల ప్రభావంతో దేశంలో యువత తీవ్రంగా నష్టపోతోంది. ముఖ్యంగా ఉద్యోగ కల్పన విషయంలో గత సంవత్సరం అనేక కార్పోరేట్ కంపెనీలు ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలకు వచ్చి ప్రతిభావంతులైన అభ్యర్ధులను ఎంపిక చేసి తమ కంపెనీలలో ఉద్యోగాలకు సంబంధించి కాల్ లెటర్స్ ఇచ్చి క్యాంపస్ ప్లేస్ మెంట్స్ నిర్వహించినా ఇప్పటి వరకు ఆ అభ్యర్ధులు ఎవరికీ కంపెనీల నుండి పిలుపులు రాకపోవడంతో ఆ అభ్యర్ధులు అంతా తీవ్ర నిరాశలో ఉన్నట్లు ఒక ప్రముఖ దినపత్రిక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.


క్రితం సంవత్సరం జనవరి ఫిబ్రవరి లో అనేక ప్రముఖ కంపెనీలు తమ సంస్థలో ఉద్యోగస్తుల ఎంపిక కోసం అనేక క్యాంపస్ ఇంతర్వ్యూలు జరిపాయి. అయితే ఆ తరువాత కరోనా పరిస్థితులు దాడి చేయడంతో అనేక సమస్యలలో పడ్డ ప్రముఖ కంపెనీలు తాము ఇప్పటికే ఇచ్చిన క్యాంపస్ ప్లేస్ మెంట్స్ కు సంబంధించిన కాల్ లెటర్స్ ను పట్టించుకోవడం లేదని దీనితో అనేకమంది తమ ఉద్యోగం వచ్చిందో లేక రాలేదో తెలియక ఇబ్బంది పడుతున్నారని ఆ కథనం పేర్కొంది.


ఇక గత సంవత్సరం అంతా ఆన్ లైన్ క్లాసులతోనే ఇంజనీరింగ్ కాలేజీలు నడవడంతో ఏ ప్రముఖ కంపెనీ కూడా క్యాంపస్ ప్లేస్ మెంట్స్ కోసం ఇంటర్వ్యూలు నిర్వహించక పోవడంతో ఇప్పుడు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్ధులకు తమ చదువులు అయ్యాక ఏమి చేయాలో తెలియక అయోమయంలో ఉన్నట్లు ఆ కథనంలో అనేక ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఖాళీగా ఉండటంతో తక్కువ వేతనం ఇచ్చి ఎక్కువ పనులు చేసే ప్రతిభావంతులైన అభ్యర్ధుల కోసం పెద్ద కంపెనీలు అన్వేషణలో ఉన్నట్లు ఆ కథనం పేర్కొంది. ప్రస్తుతం సాఫ్ట్ వేర్ కంపెనీల పనులు అన్నీ ఆన్ లైన్ లో జరుగుతున్న పరిస్థితులలో ఫ్రెషర్స్ తో ఆన్ లైన్ లో పని చేయించుకోవడం వారిని కో ఆర్డినేట్ చేయడం కష్టం అన్న అభిప్రాయంతో అనేక కంపెనీలు తమ కంపెనీలలో ఉద్యోగాల కోసం ఫ్రెషర్స్ పనికిరారు అన్న అభిప్రాయంలో ఉన్నట్లు తెలుస్తోంది..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: