గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో డ్రగ్స్ వాడుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నటులు, టెక్నీషియన్స్ సీట్ ముందు హాజరవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న నటి చార్మీ.. సిట్ అధికారుల దర్యాప్తు తీరుపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. డ్రగ్స్ కేసులో భాగంగా విచారణలో బ్లడ్ శాంపిల్స్ సేకరణ సరికాదని హైకోర్టులో రిట్ వేశారు. సినీనటి చార్మీ దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి.
చార్మీ తరపు న్యాయవాది విష్ణువర్థన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ వాదనలో పిటిషన్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కార్యదర్శి, కమిషనర్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, సిట్ సూపరింటెండెంట్లను ప్రతివాదులుగా ఉన్నారు. డ్రగ్స్ కేసులో చార్మి నిందితురాలు కాదని, అలాగే సాక్షి కూడా కాదని, అలాంటిది ఆమెకు నోటీసులు ఇవ్వడం సరికాదని అన్నారు. అంతే కాదు చార్మికి ఇంకా పెళ్లి కాలేదని, బలవంతపు రక్త నమునా సేకరణ నుంచి ఆమెను ఉపసంహరించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కాగా, ఆమె బుధవారం సిట్ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది.
చార్మీ పిటిషన్పై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు విచారణ జరపాలని సిట్ను ఆదేశించింది. విచారణలో మహిళా అధికారి తప్పనిసరిగా ఉండాలని షరతు విధించింది. అయితే చార్మీ అనుమతి లేకుండా బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. తన వ్యక్తిగత లాయర్ సమక్షంలో విచారించాలన్న చార్మీ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.