ఈ మద్య బుల్లితెరపై వస్తున్న యాంకర్లు, నటీమణులు అదృష్టం కలిసి వచ్చి వెండి తెరపై వెలిగిపోతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా జబర్ధస్త్ యాంకర్లు అనసూయ, రష్మీలు హవా కొనసాగిస్తున్నారు. తాజాగా బుల్లితెరపై `నాగిన్ (తెలుగులో నాగిని)` టీవీ సీరియల్ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి మౌని రాయ్ కి బాలీవుడ్ లో భలే కలిసి వచ్చింది.
ఆ మద్య ఈ అమ్మడికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక బాలీవుడ్ లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు మంచి శుభవార్త చెప్పింది. ప్రస్తుతం బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్తో `గోల్డ్`లో నటిస్తున్న మౌని రాయ్కి మరో ఆఫర్ కూడా వచ్చింది. స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న `బ్రహ్మాస్త్ర` చిత్రంలో నటించే ఛాన్స్ దక్కించుకుందీ నాగిని.
ఇప్పటికే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, రణ్బీర్ కపూర్, ఆలియా భట్ వంటి అగ్రతారాగణం నటిస్తున్నారు. మొత్తానికి రెండో చాన్స్ తోనే అగ్ర నటుల సరసన నటించే చాన్స్ కొట్టేసింది బుల్లితెర నాగిని. సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్లోనే మౌని రాయ్ పాల్గొంటుందని దర్శకుడు అయాన్ ముఖర్జీ వెల్లడించారు. తన రెండవ సినిమాతోనే అంత మంచి నటులతో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపింది మౌని రాయ్.