ప్రతి శుక్రవారం టాలీవుడ్ బోలెడు సినిమాలు విడుదల అవుతుంటాయి. నవంబర్ నెలలో అయితే ఇప్పటికే 25కు పైగా సినిమాలు వచ్చాయి. గత రెండు వారాలు అయితే ఓ వారం పది సినిమాలు, మరో వారం ఎనిమిది సినిమాలు థియేటర్లలోకి దిగాయి. ఈ నవంబర్లో టాలీవుడ్లో రిలీజ్ అయిన సినిమాల్లో డబ్బింగ్ సినిమాలు మినహా తెలుగు సినిమాలు ఏ ఒక్కటీ ఆడలేదు. అసలు కొన్ని తెలుగు సినిమాలు అయితే రివ్యూలకు నోచుకోలేదు.
ఇక డబ్బింగ్ సినిమాల్లో విజయ్ అదిరింది - కార్తీ ఖాకీ - విశాల్ డిటెక్టివ్ - సిద్ధార్థ్ గృహం లాంటి సినిమాలు సక్సెస్ సొంతం చేసుకున్నాయి. ఇక ఈ వీకెండ్లో మూడు సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిల్లో రెండు తెలుగు సినిమాలు అయితే మరొకటి డబ్బింగ్ సినిమా. ముందుగా గురువారం గోపీచంద్ ఆక్సిజన్, విజయ్ ఆంటోనీ నటించిన ఇంద్రసేన వస్తున్నాయి. గోపీచంద్కు ఇటీవల సరైన హిట్లు లేకపోయినా ఆక్సిజన్ ట్రైలర్తో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక బిచ్చగాడు, మయున్ సినిమాలతో తెలుగునాట మంచి పేరు తెచ్చుకున్న విజయ్ నటిస్తోన్న సినిమా కావడంతో ఇంద్రసేనకు కూడా పాజిటివ్ బజ్ ఉంది.
ఇక మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన జవాన్ సినిమా శుక్రవారం రిలీజ్ అవుతోంది. వాంటెడ్ సినిమా డైరెక్టర్ బీవీఎస్.రవి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు సమర్పిస్తున్నారు. సోషల్ పాయింట్ తో రాబోతున్న జవాన్ సినిమా విజయంపై నమ్మకంగా ఉంది చిత్ర యూనిట్. మరి గత రెండు వారాల్లోను టాలీవుడ్ వీకెండ్ చప్పగా ఉంది. మరి కాస్త అంచనాలతో వస్తోన్న ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా హిట్ అవుతుందో ? చూడాలి. వరుస ప్లాపులతో ఉన్న యంగ్ హీరోలు సాయిధరమ్, గోపీచంద్కు తమ సినిమాలు హిట్ అవ్వడం అత్యవసరం.