కొన్ని సినిమాలు అద్భుతంగా ఉంటాయి. దర్శకుడు చాలా కష్టపడి వినూత్న సబ్జక్టు ఎన్నుకుని నభూతో అన్న విధంగా తెరకెక్కిస్తారు. కానీ ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోదు. సినిమా ఎందుకు ప్రేక్షకులకు నచ్చలేదో దర్శకుడికి అర్థం కాదు.
ఇలాంటి పరిస్థితే.. మహేశ్ బాబు వన్ సినిమాకు వచ్చింది. ఇంటలిజెంట్ డైరెక్టర్ గా పేరున్న సుకుమార్ దాని దర్శకుడు. కానీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఈ సినిమాలో తప్పు ఎక్కడ జరిగిందో.. ఎందుకు పరాజయం పాలైందో ప్రముఖ సినీరచయిత పరుచూరి గోపాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో వివరించారు
ఆయన ఏమన్నారంటే... మహేష్బాబు వన్ నిజంగా గొప్ప సినిమా. గోల్డెన్ రైస్ అనే పాయింట్తో ఆ కథ మొదలవుతుంది. కానీ... ఆ కథా వస్తువుని చివరి మూడు నిమిషాల్లోనే చూపించారు. పైగా కథానాయిక పాత్ర కథానాయకుడ్ని చీట్ చేయడం పూర్తిగా అనవసరం.
సుకుమార్ కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు. బీచ్లో హీరోయిన్పై ఓ షాట్ తీద్దామనుకున్నా. కానీ కుదర్లేదు. అది తీసి ఉంటే.. ఈ లోపం కనిపించేది కాదు అన్నాడు. ఖలేజా విషయంలోనూ ఇలాంటి చిన్న పొరపాటు జరిగింది. ఆ విషయాన్నే పరుచూరి పలుకులులో చెప్పాను అంటూ వివరించారు.