నవీన్ పోలిశెట్టి ఇటీవల ఈ పేరు తెలుగు సినీ ఇండస్ట్రీ లో మారు మోగింది. దానికి కారణం ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అనే సినిమా. జూన్ లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టుకుంది. ఈసినిమాలో నవీన్ నటనకు విమర్శకులు ప్రశంసలు కురిపించారు. ఇక ఈ సినిమా తరువాత నవీన్ తెలుగులో మరో చిత్రానికి సైన్ చేసాడు.
ఆయన , పిట్టగోడ ఫేమ్ అనుదీప్ డైరెక్షన్ లో నటించేందుకు ఓకే చెప్పాడు. ఈసినిమా కు జాతి రత్నాలు అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ముగ్గురు యువకుల జీవితాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి అందులో ఒక పాత్రలో నటిస్తుండగా మిగితా పాత్రల్లో పాపులర్ కమెడియన్లు ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ నటించనున్నారు. వీరి కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు హిలేరియస్ గా వుండనున్నాయట.
కాగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో నవీన్ తెలంగాణ స్లాంగ్ లో డైలాగులు చెప్పనున్నాడు. లో బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి , రైజింగ్ కమెడియన్ వెన్నల కిశోర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మహానటి చిత్రంతో క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ నాగ్ అశ్విన్ ,స్వప్న సినిమాస్ బ్యానర్ ఫై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈఏడాది చివర్లో ఈచిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. కాగా నవీన్ పోలిశెట్టి ఈసినిమాతో పాటు బాలీవుడ్ లో ప్రస్తుతం ఛిచ్చోరె అనే చిత్రంలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకానుంది.