మెగాస్టార్ సైరా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నది. విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా సినిమా పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు అక్టోబర్ 2 వ తేదీన రిలీజ్ చేయాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇస్తున్నారు. ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేస్తూనే.. మరోవైపు ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇంకోవైపు బిజినెస్ విషయంలో బిజీగా ఉన్నారు. చారిత్రాత్మక కథతో తెరకెక్కుతున్న సినిమా కావడంతో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించారు.
మెగాస్టార్ ఇందులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర చేస్తుంటే.. అయన గురువు గోసాయి వెంకన్నగా అమితాబ్ నటిస్తున్నారు. వీరితో పాటు కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా తదితరులు ఈ మూవీలో నటిస్తున్నారు. సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రం 3:35 గంటలకు మేకింగ్ వీడియో రిలీజ్ చేయబోతున్నారు.
ఈ వీడియో ఎలా ఉంటుంది అనే దానిపై ఆధారపడి సినిమా బిజినెస్ ఉండొచ్చు. ట్రైలర్ ను దోహాలో జరిగే సైమా వేడుకల్లో రిలీజ్ చేసే అవకాశం ఉన్నది. ఇదిలా ఉంటె ఈ సినిమా హిందీ రైట్స్ ను బాలీవుడ్ నటుడు దర్శకుడు, నిర్మాత ఫర్హాన్ అక్తర్ తీసుకున్నాడు. ఫర్హాన్ కు చెందిన ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ సంస్థ, అలానే ఏ ఏ ఫిలిమ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమా రైట్స్ ను తీసుకున్నాయి.
అయితే, రైట్స్ ఎంతవరకు పలికింది అన్నది తెలియాలి. గతంలో ఫర్హాన్ కన్నడ సినిమా కేజీఎఫ్ హిందీ రైట్స్ ను తీసుకున్నారు. హిందీలో ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. దాదాపుగా వందకోట్ల రూపాయలకు పైగా ఈ సినిమా వసూళ్లు సాధించడంతో.. ఇప్పుడు సైరాను రైట్స్ ను తీసుకున్నాడు ఫర్హాన్. అయితే, అదే రోజున హృతిక్ రోషన్ వార్ సినిమా కూడా రిలీజ్ కాబోతున్నది. బాలీవుడ్ లో ఈ రెండు సినిమాలు క్లాష్ కాబోతున్నాయి. ఏ సినిమా హిట్ అవుతుంది అన్నది తెలియాలంటే అక్టోబర్ 2 వ తేదీ వరకు ఆగాల్సిందే.