టాలీవుడ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఫెస్టివల్ సాహోకు రంగం సిద్ధమయ్యింది. సినిమా రిలీజ్కు మరో ఆరు రోజుల టైం మాత్రమే ఉండడంతో ఆన్ లైన్ బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే విజయవాడ, వైజాగ్, తిరుపతి లాంటి సెంటర్లలో ఉదయం 6 గంటల నుంచే షోల టిక్కెట్లు అమ్మేస్తున్నారు. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో సైతం నాలుగైదు స్క్రీన్లకు సంబందించి అమ్మకాలు మొదలుపెట్టేశారు.
ఇప్పటి వరకు అందిన అప్డేట్ ప్రకారం చూస్తే ధరల రేట్లు పెంపుదల కేవలం ఏపీలో మాత్రమే ఉందని.. ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా ఉందని.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం సాహోకు షాక్ ఇచ్చిందని తెలుస్తోంది. టిక్కెట్ల రేట్ల కోసం సాహో నిర్మాతలు తెలంగాణ సర్కార్ను అప్రోచ్ అయినా తెలంగాణ తన పాత ధోరణికే కట్టుబడి ఉందని తెలుస్తోంది.ట్విన్ సిటీస్ లో పెట్టిన బుకింగ్స్ లో సైతం పాత రేట్లే ఉండటం గమనార్హం.
ఏపీలో పెట్టిన ఆన్లైన్ బుకింగ్స్లో మాత్రం సాహోకు పెరిగిన రేట్లే కనిపిస్తున్నాయి. మరో ట్విస్ట్ ఏంటంటే బెనిఫిట్ షోల విషయంలోనూ ఏపీలోనే సానుకూల చర్యలున్నాయని తెలంగాణలో వేయడం డౌటేనని వినికిడి. తెలంగాణలో ఎంత పెద్ద సినిమా అయినా బెనిఫిట్ షోల విషయంలో ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. ఏదేమైనా బాహుబలి బజ్తో వస్తోన్న సినిమా కావడం... దేశవ్యాప్తంగా కూడా అన్ని భాషల్లోనూ సోలోగానే రావడం సినిమాకు ప్లస్.
ఇతర భాషల్లో పోటీ సినిమాలన్నీ పక్కకు తప్పుకుని డేట్లు మార్చుకోవడంతో అందరి దృష్టి సాహో మీదే ఉంది. సాహో సినీ లవర్స్ అందరూ ఈ ఆరు రోజులు ఎప్పుడెప్పుడు ముగుస్తాయా ? అని ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా రూ.333 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమాకు తొలి రోజు వచ్చే ఓపెనింగ్స్పై కూడా అప్పుడే రకరకాల చర్చలు స్టార్ట్ అయ్యాయి.