సాహో గత శుక్రవారం రోజున భారీగా రిలీజ్ అయ్యింది. హెవీ హైప్ తో రిలీజైన ఈ సినిమా రిలీజ్ తరువాత ఆ హైప్ ను అందుకోలేకపోయింది. సినిమాకోసం భారీగా విజువల్ ఎఫెక్ట్స్ ను ఉపయోగించారని, ఇండియన్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ గా చెప్పుకున్నారు. అంతేకాదు.. ఇప్పటి వరకు చూడని యాక్షన్ ను సినిమాలో చూపించినట్టు చెప్పారు. తీరా చివరకు వచ్చే సరికి ఏమైంది.. సినిమా బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అన్నది.
సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ప్రభాస్ ఓ మాట చెప్పారు. మాములుగా సినిమా తీసి ఉంటె నిర్మాతలకు కనీసం వంద కోట్ల రూపాయల లాభాలు వచ్చి ఉండేవి. కానీ, డబ్బును లెక్కచేయకుండా భారీగా ఖర్చు చేశారు. వారి ధైర్యానికి మెచ్చుకోవాలి. సినిమా కోసం ఈ స్థాయిలో ఖర్చు చేయడం అన్నది మాములు విషయం కాదు. అని ప్రభాస్ యూవీ క్రియేషన్స్ వాళ్ళను ఆకాశానికి ఎత్తారు.
అటు మరో నిర్మాత అల్లు అరవింద్ కూడా అదే మాట చెప్పడంతో సినిమాకు నిజంగానే ఆ స్థాయిలో ఖర్చు పెట్టరేమో అనుకున్నారు. తీరా చూస్తే.. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ రేస్ 3 సినిమా చూసినట్టు అనిపించింది. ఆ మూవీ కూడా అదే స్థాయిలో ఊహించుకున్నారు. భారీ చేజింగ్ ఫైట్స్.. అబ్బో హంగామా మాములుగా లేదు. తీరా థియేటర్ల దగ్గరికి వెళ్లే సరికి చతికిల పడింది.
ఇప్పుడు సాహో విషయంలో కూడా అదే విషంగా జరిగింది. సినిమాను అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లడం అన్నది మంచి విషయమే... కానీ, ఆ స్థాయిలో సినిమా చేయాలి అనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా అన్ని రకాల హంగామాలు ఉండాలి. కేవలం యాక్షన్ పార్ట్ మాత్రమే దృష్టిలో పెట్టుకొని సినిమా తీస్తే బాగుండదు. నవరసాలు కలిస్తేనే సినిమా. గత సినిమా హైప్ ను దృష్టిలో పెట్టుకొని ఏం తీసినా చూస్తారులే అనుకుంటే ఇలానే ఉంటుంది మరి. సాహో ఫెయిల్ కావడంతో జిల్ దర్శకుడు రాధాకృష్ణపై ఒత్తిడి పెరిగింది. ఆ ఒత్తిడిని ఎలా తట్టుకుంటాడో చూడాలి.