టాలీవుడ్లో వచ్చే సంక్రాంతికి రెండు మూడు భారీ సినిమాల విడుదల తేదీలు ఖరారయ్యాయి. అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల వైకుంఠపురం లో సినిమాతో పాటు, మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకేవ్వరూ రిలీజ్ డేట్ ను ఇప్పటికే ప్రకటించారు. ఈ రెండు సినిమాలు పోటాపోటీగా జనవరి 12న థియేటర్లలోకి దిగుతున్నాయి. అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించిన కొద్ది నిమిషాలకే మహేష్ బాబు కూడా తమ సినిమా కూడా అదే రోజు రిలీజ్ అవుతుందని రిలీజ్ డేట్ చెప్పి పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు.
మామూలు సీజన్లో సినిమాలు శుక్రవారం రిలీజ్ అవుతున్నాయి. కానీ ఈ రెండు సినిమాలను ఆదివారమే రిలీజ్ చేస్తుండటం విశేషం. ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే ఎలా ఉంటుందో తెలిసిందే. అసలు ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ ఎందుకు అవుతున్నాయి. ఎవరు పంతానికి పోయారు అన్న దానిపై ఇండస్ట్రీలో రకరకాలుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
ముందుగా మహేష్ తమ సినిమాను 12న రిలీజ్ చేసుకుంటామని 11న రావాలని అల వైకుంఠపురంలో మేకర్స్ కు కబురు పంపాడట. లేనిపక్షంలో తాము 12న వస్తాం... మీరు 14న వచ్చిన ఓకే అని కూడా మహేష్ చెప్పాడట. అయితే ఒకరోజు ముందు వస్తే ఆ మరుసటి రోజు రిలీజ్ అయ్యే మహేష్ సినిమాకు అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో బన్నీ సినిమా మేకర్లు మహేష్ ప్రతిపాదనకు ఒప్పుకోలేదని తెలుస్తోంది.
ఈ విషయంలో తన మాట వినలేదని పంతానికి పోయిన మహేష్.. బన్నీ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన గంటలోపే తన సినిమా సైతం అదే రోజు రిలీజ్ చేస్తున్నట్టు హడావుడిగా పోస్టర్ రిలీజ్ చేయించాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి మంచి స్నేహితులైన అల్లు అరవింద్, దిల్ రాజు రాజీ పడకుండా తమ సినిమాల్ని పోటాపోటీగా ఒకే రోజు రిలీజ్ చేయడానికి రెడీ అయిపోవడం ఆశ్చర్యమే. తర్వాత ఏమైనా రాజీకి వచ్చి ఏదో ఒక సినిమా డేట్ మారుస్తారేమో చూడాలి.