తమిళ హీరో కార్తి నటించిన లేటెస్ట్ మూవీ ఖైదీ దీపావళికి కానుకగా ఈనెల 25న తమిళతోపాటు తెలుగులోనూ విడుదలకానుంది. అయితే ఇటీవల కార్తి నటించిన సినిమాలు తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. దాంతో ఈ చిత్రం విజయం సాధించడం కార్తి కెరీర్ కు కీలకం కానుంది ఇదిలా ఉంటే ఈ చిత్రం యొక్క థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత , సత్యసాయి ఆర్ట్స్ అధినేత కేకే రాధామోహన్ సొంతం చేసుకున్నాడు. ఇటీవల కార్తి అన్న స్టార్ హీరో సూర్య నటించిన ఎన్జీకె ను కూడా తెలుగులో ఆయనే విడుదలచేశారు. అయితే ఆ చిత్రం భారీ నష్టాలను మిగిల్చింది. మరి ఖైదీ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. ఇక ఖైదీ తెలుగులో 4.3కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈలెక్కన 5కోట్ల షేర్ తెస్తేనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక ఈ చిత్రంలో కొన్ని ప్రత్యేకతలు వున్నాయి అవేంటంటే ... హీరోయిన్ మరియు సాంగ్స్ లేకుండా ఈచిత్రాన్ని తెరక్కించారు. అలాగే ఈ సినిమా స్టోరీ అంతా ఒక్క రాత్రి లోనే జరుగుతుంది.
ఇంటెన్సివ్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రానికి సామ్ సీఎస్ అందించిన నేపథ్య సంగీతం అదనపు బలం కానుంది. అయితే ఖైదీ కి బాక్సాఫీస్ వద్ద విజయ్ నటించిన విజిల్ తో గట్టి పోటీ ఎదురుకానుంది. ఇక కార్తి ప్రస్తుతం రెమో ఫేమ్ భాగ్యరాజ్ కణ్ణన్ డైరెక్షన్ లో సుల్తాన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. కోలీవుడ్ లోఆమెకు ఇదే మొదటి సినిమా. డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది పొంగల్ కానుకగా విడుదలకానుంది.