టాలీవుడ్ పవర్ స్టార్ గా పేరుగాంచిన పవన్ కళ్యాణ్, గత ఏడాది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసితో సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన సినిమాలు మానేసి పూర్తిగా తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేయాలని భావించి, జనసేన పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. ఇక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పార్టీ ఏపీ నుండి పోటీ చేసి ఘోర పరాజయాన్ని అందుకోవడంతో, ఇకపై పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పవన్ సిద్ధం అయ్యారు. అయితే పవన్ ఎంత రాజకీయాల్లో ఉన్నప్పటికీ, ఆయన మరొక్క సినిమాలో నటిస్తే చూడాలని ఎందరో ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే దానికి ప్రధాన కారణం ఆయన చివరి సినిమాగా వచ్చిన అజ్ఞాతవాసినే.
పవన్ కెరీర్ 25వ సినిమాగా వచ్చిన అజ్ఞాతవాసి, టాలీవుడ్ లో అతి పెద్ద డిజాస్టర్ గా నిలవడంతో ఆయన ఫ్యాన్స్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే తమకోసం చివరిగా పవన్ గారు ఒక మంచి హిట్ సినిమాలో నటిస్తే బాగుంటుందని ఆశ పడుతున్నారు. ఇక ఈ విషయమై పవన్ మళ్ళి సినిమాల్లోకి వస్తున్నారు అంటూ కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు కూడా ప్రచారం అవడం జరిగింది. అయితే రెండు రోజుల నుండి ఈ విషయమై కొందరు టాలీవుడ్ వర్గాల వారు చెప్తున్న దానిని బట్టి, పవన్ కళ్యాణ్ గారు తన ఫ్యాన్స్ కోసం ఆఖరిగా ఒక సినిమాలో నటించడానికి సిద్ధమయినట్లు తెలుస్తోంది.
అలానే ఈ ప్రతిష్టాత్మక సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తారని టాక్. ఇప్పటికే పవన్ ఇమేజీకి సరిపోయే మంచి సామజిక అంశంతో కూడిన కథను క్రిష్ సిద్ధం చేసారని, కాగా కథను పవన్ కు వినిపించడానికి క్రిష్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని సమాచారం. నిజానికి పవన్ గారు గతంలో తనకు మంచి కథ సిద్ధం చేయమని క్రిష్ కు చెప్పడం జరిగిందని, మరొక రెండు రోజుల్లో క్రిష్ కథ చెప్పిన తరువాత ఈ సినిమా గురించి ప్రకటన బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా టాక్. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త పై అధికారిక ప్రకటన మాత్రం వెలువడవలసి ఉంది......!!