టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగి లేడీ సూపర్ స్టార్ గా ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన విజయశాంతి దాదాపు 15 సంవత్సరాల గ్యాప్ తరువాత ప్రస్తుతం మహేష్ తో ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో నటిస్తోంది. ఫైర్ బ్రాండ్ లేడీ పొలిటీషియన్ గా పేరు పొందిన ఈమె సొంతంగా ఒక రాజకీయ పార్టీ పెట్టి తెలంగాణ ఉద్యమంలో తన గొంతును వినిపించడానికి గట్టి ప్రయత్నాలు చేసింది.
మొన్న జరిగిన దీపావళి సందర్భంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన ఫిలిం రీ ఎంట్రీ గురించి అదేవిధంగా తెలంగాణ ఉద్యమం గురించి అనేక ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రత్యేక తెలంగాణ కోసం తాను 1997 లో తల్లి తెలంగాణ పార్టీ పెట్టిన విషయాలను గుర్తుకు చేసుకుంటూ తాను రాజకీయ పార్టీ పెట్టే సమయానికి టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావమే జరగలేదు అంటూ కామెంట్స్ చేసింది.
అంతేకాదు తాను పదవుల కోసం డబ్బు కోసం రాజకీయాలలోకి రాలేదనీ ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షతో తాను ఉద్యమంలోకి వచ్చిన విషయాన్ని వివరించింది. తెలంగాణ ఉద్యమంలో తాను ఎన్నోసార్లు అరెస్ట్ అయి చెంచల్ గుడా జైలు లో అనేకమంది మహిళా ఖైదీలు ఉన్న రూమ్ లో దోమలు కుడుతూ ఉంటే నిద్రపట్టక తాను నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపిన విషయాలను వివరించింది.
ప్రస్తుతం తాను సినిమాలో నటిస్తున్నంత మాత్రాన రాజకీయాలకు దూరం కాలేదనీ కేవలం తన రాజకీయ జీవితానికి ఇంటర్వెల్ వచ్చిందనీ త్వరలో పవర్ ఫుల్ సెకండ్ పార్ట్ ఉండబోతోంది అంటూ లీకులు ఇచ్చింది. దీనితో విజయశాంతి బిజెపి లో చేరుతున్నట్లుగా వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఈసారి ఒక వైపు సినిమాలు చేస్తూ తన ఇమేజ్ ని మళ్ళీ పెంచుకుని మరొక వైపు రాజకీయాలు కొనసాగిస్తూ రెండు పడవల సిద్ధాంతాన్ని ఈ రాములమ్మ అనుసరించ బోతోంది అనుకోవాలి..