తెలుగు సినిమాలకు తన అందమైన హాస్యంతో వన్నె తెచ్చిన గొప్ప నటి గీతాంజలి. గురువారం తెల్లవారు జామున గుండెపోటుతో మృతిచెందారు. జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఈ రోజు ఉదయం 4 గంటలకు ఆమె తుది శ్వాస విడిచారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జన్మించిన గీతాంజలి 1961లో ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన సీతారామ కళ్యాణం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న గీతాంజలి ‘దేవత’సినిమాలో హాస్య పాత్రలో అలరించారు.
అప్పటి నుంచి ఆమె వరుసగా హాస్య పాత్రల్లో నిటిస్తూ మెప్పించారు. కాలం మారింది, పూల రంగడు, శారద, డాక్టర్ చక్రవర్తి, పూలరంగడు, మురళీకృష్ణ, అవేకళ్లు, సంబరాల రాంబాబు, కలవారి కోడలు, గుఢచారి 116, దేవత, నిండు హృదయాలు వంటి హిట్ సినిమాల్లో నటించి మంచిపేరు సంపాదించారు. ఆమె సహనటుడు రామకృష్ణను ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. క్యారక్టర్ ఆర్టిస్ట్గా మారిన ఆమె పెళ్ళైన కొత్తలో,మాయాజాలం, భాయ్, గ్రీకువీరుడు తదితర చిత్రాల్లో నటించారు. కాగా, గీతాంజలి చివరి చిత్రం తమన్నా కథానాయికగా రూపొందుతున్న దటీజ్ మహాలక్ష్మిలో నటించారు. గీతాంజలి నంది అవార్డు కమిటీ మెంబర్గా కూడా పనిచేశారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహానటి సావిత్రితో ఆమెకు ఉన్న అనుబంధాన్ని గురించి చెప్పారు. మహానటి సావిత్రి హీరోయిన్ గానే కాకుండా ‘నవరాత్రి’ సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. ఈ మూవీలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ లో బిజీగా ఉన్న హీరోయిన్లు..ఇతర నటీమణులు ఒకే ఫ్రేమ్ లో కనిపించాము. గిరిజ, ఛాయాదేవి, సూర్యకాంతం, జయలలిత, కాంచన, జమున ఇంకా నేను ఆ సినిమాలో అతిథి పాత్రల్లో నటించాం. ఆసుపత్రిలో చిత్రీకరించిన ఓ పాటలో మేం మతిభ్రమించినవాళ్లలా కనిపించి అల్లరి చేస్తాం.
కేవలం సావిత్రమ్మ మాట మీద గౌరవంతో అందరం కలిశాం. సాయంత్రం 7.30కు చిత్రీకరణ మొదలుపెట్టి రెండో రోజు ఉదయం 6 గంటలకల్లా చిత్రీకరణ పూర్తి చేశాం. అప్పట్లో ఈ సీన్ చూసి ఎంతో మంది తమపై ప్రశంసలు కురిపించారు. అయితే షూటింగ్ పూర్తయిన తర్వాత సావిత్రమ్మ మా అందరికీ బెనారస్ పట్టు చీర ఇచ్చారు. అంతే కాదు వెయ్యి రూపాయల విలువ చేసే డైమండ్ ఉంగరం ఇచ్చారు. ‘మా పిచ్చోళ్లు ఎంత బాగా చేశారో’ అని ఆమె చాలా ఆనందపడ్డారు.