నేచురల్ స్టార్ నాని సినిమా వస్తుందంటే మనందరం ముందుగా కోరుకునేది కావలసినంత కామెడీ. ఆ తరవాత సెంటిమెంట్, ఫ్యామిలి ఎమోషన్స్. అప్పుడప్పుడు మధ్యలో కొన్ని యాక్షన్ సీన్స్. మొత్తంగా చూసుకుంటే కుటుంబం మొత్తం రెండున్నర గంటలపాటు హాయిగా చూడగలిగే సినిమాలే నాని ఎక్కువగా చేస్తాడు. కానీ ఈసారి మాత్రం ఫుల్ వయొలెన్స్తో వస్తున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 2020 ఉగాదికి ఫుల్ వయొలెన్స్తో వస్తున్నా అని.
నాని, సుధీర్బాబు హీరోలుగా నివేదా థామస్, అదితిరావు హైదరి హీరోయిన్లుగా రూపొందుతున్న తాజా సినిమా ‘వి’. ‘ఈ క్షణం నుంచి నా శత్రువులకి నా దయా దాక్షిణ్యాలే దిక్కు’ అనేది ట్యాగ్ లైన్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. నానికి 25వ గా వస్తున్న ఈ సినిమాని నిర్మాత దిల్రాజు సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై శిరీష్, లక్ష్మణ్, హర్షిత్ నిర్మిస్తున్నారు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాను 2020 లో ఉగాది సందర్భంగా మార్చి 25న విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని నాని సోషల్ మీడియా ద్వారా పోస్టర్ను రిలీజ్ చేసి అభిమానులతో షేర్ చేసుకున్నారు.
విడుదల తేదీ ప్రకటించిన సందర్భంగా నిర్మాతలు ‘‘నాని 25వ సినిమా మా బ్యానర్లో రూపొందుతుండటం ఆనందంగా ఉందని అన్నారు. అలాగే సుధీర్బాబు, నివేదా థామస్, అదితిరావు కాంబినేషన్ ప్రేక్ష్కూలను అలరిస్తుంది. ‘సమ్మోహనం’ వంటి సూపర్హిట్ తర్వాత మోహనకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. రెండు ఫైట్స్, ఓ సాంగ్ మాత్రం బ్యాలెన్స్ ఉందట. ఇప్పటి వరకు చూడని ఓ కొత్త పాత్రలో నాని కనపడతారని తెలుస్తోంది.