టాలీవుడ్ యువ కథానాయకుడు వరుణ్ తేజ్ తన తదుపరి సినిమా కోసం బాక్సర్ అవతారం ఎత్తనున్నారు. కిరణ్ కొర్రపాటి ఈ సినిమా కు దర్శకత్వం వహిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్ పాత్రలో కనిపించనున్నారు. ఇందుకోసం వరుణ్ తేజ్ చాలా కఠోర సాధన చేస్తున్నారు, వరుణ్ తన బాక్సింగ్ ట్రైనింగ్ కోసం అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో వరుణ్ తేజ్ బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు.
తన బాక్సింగ్ ట్రైనింగ్ గురించి వరుణ్ ఒక ఆంగ్ల మీడియా పత్రిక తో మాట్లాడుతూ "కిరణ్ కొర్రపాటి చిత్రంలో నటించడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ముంబయికి చెందిన ట్రైనర్ సారథ్యంలో బరువు తగ్గడానికి సాధన చేస్తున్నాను. బాక్సింగ్ ట్రైనింగ్ కోసం లాస్ ఏంజెల్స్కు చెందిన ఓ ట్రైనర్తో కలిసి పనిచేస్తున్నాను. ఇప్పటివరకూ విభిన్న పాత్రల్లో నటించాను. కానీ మొదటిసారి ఇప్పుడు చేయబోయే పాత్ర కోసం నేను ఫిజికల్గా మారుతున్నాను." అని చెప్పారు వరుణ్ తేజ్.
ఇక చిత్ర విషయానికి వస్తే, చిత్రం లో కియారా అద్వానీ హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ సరసన కియారా అద్వానీ మొట్టమొదటిసారిగా కనిపించనుంది. ఈ బాలీవుడ్ భామ ఇదివరకు భరత్ అనే నేను మరియు వినయ విధేయ రామా చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గర అయ్యారు. ఇక వరుణ్ తేజ్ కూడా ఇటీవల విడుదలైన ‘గద్దలకొండ గణేష్’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకుని మరో విజయంపై కన్నేసాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా పై మెగా ఫాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా పేరు ఇంకా నిర్ణయించలేదని సమాచారం అంతే కాకుండా సినిమా కు సంబంధించిన సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి వుంది. సినిమా నిర్మాత గురించిన వివరాలు కూడా తెలియాల్సి వుంది.