బాలయ్య ఆత్మీయత చూసి ఆ అమ్మాయి ఉప్పొంగిపోయింది..ఎందుకో తెలుసా?
ఈ మద్య స్టార్ హీరోలు తమ మంచి మనసు చాటుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్ సినిమాల కన్నా సేవా కార్యక్రమాలతోనే అందరి మనసులని గెలుచుకుంటున్నారు. ఆ మద్య బీహార్ వరదబాధితులకి ఒక్కో కుటుంబానికి 4 లక్షల చొప్పున సాయం అందించాలని ఆయన ప్రతిపాదించారు. చాత్ పూజ శుభ సందర్భంగా రూ. 1 కోటి రూపాయల అందజేశారు. గతంలో ఏపిలో తితిలీ తుఫాన్ వచ్చినపుడు సినీ ఇండస్ట్రీ నుంచి ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, వరుణ్ తేజ్, నిఖిల్, సంపూర్ణేష్ బాబు, విజయ్ దేవరకొండ ఆర్థిక సహాయం అందించారు.
గతంలో తమ అభిమానుల గురించి ఏకంగా ఆసుపత్రికి..వారి ఇంటికి వెళ్లి మరీ పరామర్శించి వారికి ధైర్యం చెప్పిన హీరోలు తమ అభిమానులకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే స్పందించి సహాయం అందిస్తున్నారు. తమిళనాట విజయ్, సూర్య,కార్తీ, అజిత్, లారెన్స్ లాంటి హీరోలు తమ అభిమానులను ఎన్నో సార్లు ఆదుకున్నారు. తాజాగా ఎముకల క్యాన్సర్ తో బాధపడుతున్న స్వప్న అనే విద్యార్థినికి నందమూరి బాలకృష్ణ ధైర్యవచనాలు పలికారు. బాలకృష్ణ తమ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం స్వప్న హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సేవలు పొందుతోంది.
ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ క్యాన్సర్ తో బాధపడుతున్న స్వప్నను పలకరించారు. డాక్టర్లతో మాట్లాడి ఆమె ఆరోగ్య స్థితి వివరాలు తెలుసుకున్నారు. ఆమెలో ఆత్మస్థైర్యాన్ని నింపిన బాలకృష్ణ ఆత్మీయత చూసి ఆ విద్యార్థిని ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. మరికొన్నిరోజుల్లో స్వప్నకు శస్త్రచికిత్స నిర్వహించేందుకు వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని సార్లు తన అభిమానుల పట్ల దురుసుగా వ్యవహరించే బాలయ్య మంచి మనుసు చూసి పలువురు ప్రశంసిస్తున్నారు.