ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కొత్త కారు తో ఈ దశాబ్దానికి ఘనంగా స్వాగతం పలికింది. తాజాగా నిధి ఖరీదైన పోర్షే కారును కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ కోలీవుడ్ లో స్టార్ హీరో జయం రవి సరసన భూమి అనే సినిమాలో నటిస్తుంది. రోమియో,జూలియట్ ఫేమ్ లక్ష్మణ్ ఈచిత్రాన్ని తెరకెక్కిస్తుండగా ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిధి మోడ్రన్ అమ్మాయిగా ఊరికి వచ్చి హీరో మిషిన్ కు సపోర్ట్ చేసే పాత్రలో కనిపించనుంది. కోలీవుడ్ లో ఆమె కు ఇదే మొదటి సినిమా..
ఇదిలా ఉంటే యువ సామ్రాట్ నాగ చైతన్య సరసన సవ్యసాచి లో నటించి టాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చిన నిధికి తొలి సినిమానే షాక్ ఇచ్చింది. మంచి అంచనాల మధ్య విడుదలైన ఆ చిత్రం డిజాస్టర్ ఫలితాన్ని రాబట్టింది. ఇక అన్న తో కాకుండా తమ్ముడి తోనైనా హిట్ కొడదామనుకున్న నిధికి మరోసారి నిరాశే ఎదురైంది. సవ్యసాచి తరువాత నిధి , అక్కినేని అఖిల్ తో మిస్టర్ మజ్ను లో నటించింది. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం పరాజయాన్ని మూటగట్టుకుంది.
అలా రెండు చిత్రాలు ప్లాప్ కావడంతో ఆమె కు అవకాశాలు రావడం గగనమైపోయింది. అయితే ఎట్టకేలకు డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, నిధి కి ఇస్మార్ట్ శంకర్ లో ఓ హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు. ఈ సినిమాలో నిధి నటన పరంగా ఓకే అనిపించినా గ్లామర్ తో ఆకట్టుకుంది. దానికి తోడు సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం తరువాత నిధి ప్రస్తుతం తెలుగులో అశోక్ గల్లా, శ్రీ రామ్ ఆదిత్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తుంది. ఇటీవలే ఈసినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.