బన్నీ సెటైర్లు ఎవరిమీద... ఆ మాటలు ఎవరికి తగిలాయ్...!
జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి వంటి బాక్స్ ఆఫీస్ హిట్స్ అనంతరం అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం `అల.. వైకుంఠపురములో`. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, కె. రాధాకృష్ణ నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రంపై మొదటి నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. ఇక డీసెంట్ గా షో మొదలుపెట్టిన ఈ చిత్రం రాను రాను కలెక్షన్స్ ను ఇంప్రూవ్ చేసుకుంటూ సంక్రాంతి విన్నర్ గా నిలిచి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఇప్పుడు ఏకంగా బాహుబలి రికార్డులకు ఎసరు పెట్టింది.
ఇలా ఈ చిత్రం ఎన్నో రికార్డులు క్రియేట్ చేయడంతో తాజాగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో అల్లు అర్జున్, త్రివిక్రమ్, నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే మీడియాతో మాట్లాడిన బన్నీ.. అమెరికా నుంచి అనకాపల్లి సెంటర్ వరకు మా సినిమా దూసుకుపోతోందని అంతా అంటుంటే నాకింకా ఆశ్చర్యంగానే ఉంది. నేను కూడా ప్రతి రోజూ డీసీఆర్ షీట్ చూసి ఆశ్చర్యపోతున్నాను. నాకు కూడా ఓ అంచనా ఉండేది. ప్రతి రోజు ఇక ఈ సినిమా ఆగుతుందేమో అనుకుంటున్నాను. కానీ ఈ సినిమా ఆగట్లేదు.
ఈ సినిమాకి మనం బెస్ట్ చేయాలని.. నేను పని మాత్రం చేశాను. అయితే జనాలు దాన్ని అప్రిషియేట్ చేసి నెక్స్ట్ లెవల్కు తీసుకెళ్లారు. నిజంగానే నాకు ఆశ్చర్యంగా ఉందన్నాడు. అయితే రికార్డులు ఎప్పటికైనా మారిపోతాయి. 6 నెలల తర్వాత నా రికార్డు పోవచ్చు. కానీ ఓ మంచి సినిమా తీశామని ప్రేక్షకులు గుర్తించారు. అది చాలన్నాడు బన్నీ. అంటే ఇది మంచి సినిమా అని చెప్పకనే చెప్పాడు. దీంతో ఈ వ్యాఖ్యలు పరోక్షంగా ఈ సినిమాకు పోటీగా ప్రచారంలో ఉన్న మరో హీరో సినిమా గురించి అన్న చర్చ నడుస్తోంది.