'చావు కబురు చల్లగా' చెప్పే బస్తీ బాలరాజుతో అల్లు అరవింద్..!
ఆర్ఎక్స్ 100 సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో కార్తికేయ. ఈ చిత్రంతో సన్సేషనల్ హిట్ అందుకోవడయే కాకుండా.. మొదటి సినిమాతోనే యూత్లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ యంగ్ హీరో. ఏ క్షణాన ఆర్ఎక్స్ 100 సినిమా ఒప్పుకున్నాడో గాని అతనికి ఆ సినిమా ఒక మంచి మార్క్ గా నిలిచింది. బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. అయితే ఆ తర్వాత వచ్చిన హిప్పి, గుణ 369 ఈ రెండు చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 90 ఎంఎల్ చిత్రం కూడా కార్తికేయకు హిట్ అందించలేకపోయింది. అయితే ఆని గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్గా కార్తికేయ ఆకట్టుకున్నారు.
ఇలా ఒక వైపున మాస్ హీరోగా మంచి మార్కులు కొట్టేస్తూనే, మరో వైపున నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను చేయడానికి కార్తికేయ ఉత్సాహాన్ని చూపుతున్నాడు. నటుడిగా తనని తాను నిరూపించుకోవడానికి విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. ఇక తాజాగా కార్తికేయ..చావు కబురు చల్లగా చెప్పాడు. అదేంటి అనుకుంటున్నారా.. కార్తికేయ కొత్త సినిమా టైటిల్ అదే మరి. స్మాల్ హీరోలతో సినిమాలు ప్రకటిస్తున్న వస్తున్న గీత్ ఆర్ట్స్ 2.. తాజాగా కార్తికేయ తో ఈ సినిమా చేస్తుంది. ఈ సినిమాతో కౌశిక్ అనే కొత్త దర్శకుడు టాలీవుడ్కు పరిచయం అవుతున్నాడు. అలాగే బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో 'బస్తీ బాలరాజు' పాత్రలో కార్తికేయ కనిపించనున్నాడు.
ఇక నేడు హైదరాబాద్లో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభించారు. ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి షూటింగ్ను మొదలుపెట్టారు. ‘చావు కబురు చల్లగా..!’ ముహూర్తపు షాట్కి బన్నీ వాస్ కుమార్తె క్లాప్ కొట్టింది. అల్లు అర్జున్ తనయుడు అయాన్ కెమెరా స్విచ్ ఆన్ చేశాడు. అల్లు అరవింద్, అయాన్, బన్నీ వాస్ కూతురు కలిసి స్క్రిప్ట్ను కార్తికేయ, దర్శకుడు కౌశిక్కు అందజేశారు. కాగా, ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ ను కూడా వదిలారు. శవాలను శ్మశానానికి తీసుకెళ్లే వాహనంపై నుంచుని దమ్ముకొడుతూ కర్తికేయ కనిపిస్తున్నాడు. మరి ఈ సినిమా అయినా కర్తీకేయకు మంచి హిట్ ఇస్తుందో లేదో చూడాలి.