సుధీర్ఘ విరామం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు పవన్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకుడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది.
ఈ సినిమా కోసం దిల్ రాజు `వకీల్ సాబ్` అనే టైటిల్ను ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేయించాడు. అధికారికంగా ప్రకటించకపోయినా దిల్ రాజు బ్యానర్పై రిజిస్టర్ కావటంతో ఈ టైటిల్ పవన్ సినిమా కోసమే అని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ తాజా దిల్ రాజు మరో టైటిల్ను కూడా రిజిస్టర్ చేయించాడు. `లాయర్ సాబ్` అనే మరో టైటిల్ను కూడా ఫిలిం చాంబర్లో రిజిస్టర్ చేశాడు. దీంతో పవన్ సినిమాకు టైటిల్ మార్చే ఆలోచనలో ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది.
అయితే ఈ మార్పుకు కారణాలు కూడా అంచనాలు వేస్తున్నారు సినీ విశ్లేషకులు. ఇటీవల దిల్ రాజు బ్యానర్లో రిలీజ్ అయిన జాను సినిమాకు మంచి టాక్ వచ్చినా వసూళ్లు మాత్రం ఏమంత ఆశాజనకంగా లేవు. అందుకే పవన్ సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే న్యూమరాలజీ ప్రకారం వకీల్ సాబ్ కన్నా లాయర్ షాబ్ అయితే బెటర్ అన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారట. అయితే టైటిల్ ఏంటన్నది అధికారికంగా తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమా తరువాత చేయబోయే సినిమాను కూడా పవన్ లైన్లో పెట్టాడు. లాయర్ సాబ్ తరువాత క్రిష్ దర్శకత్వంలో ఓ బయోగ్రాఫికల్ పీరియడ్ డ్రామాలో నటించనున్నాడు పవన్.
మరింత సమాచారం తెలుసుకోండి: