నితిన్ ‘భీష్మ’కు కరోనా దెబ్బ..
తెలుగు ఇండస్ట్రీలో వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న హీరో నితిన్ ‘భీష్మ’ చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు. వెంకి కుడుముల దర్శకత్వంలో రష్మిక మందన హీరోయిన్ గా నటించిన భీష్మ ఈ ఏడాది హిట్ చిత్రంలో ఒకటిగా నిలిచింది. అయితే ఎప్పటి నుంచో మంచి విజయం కోసం ఎదురు చూస్తున్న నితిన్ కి ఈ చిత్రం మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇక ఆ మద్య వరుస సెలవులు రావడంతో కలెక్షన్లు కూడా బాగానే రాబట్టింది. వాస్తవానికి భీష్మకు ఏ చిత్రం కూడా పోటీగా లేకపోవడం కలెక్షన్తు దూసుకు వెళ్తున్నాయి. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సరిలేరు నీకెవ్వరు, అలా వైకుంఠపురములో ఇప్పటికే 50 రోజులు దాటి పోవడంతో భీష్మ కు కలెక్షన్ల పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది.
కానీ నితిన్ కి ఇప్పుడు కొత్త సమస్య వచ్చిపడింది. గత కొన్ని రోజుల నుంచి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఇండస్ట్రీపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పటికే స్టార్ హీరోల చిత్రాలు వరుసగా వాయిదాలు వేస్తున్నారు. ముఖ్యంగా మల్టీప్లెక్స్, కొన్ని థియేటర్లలోకి జనాలు వెళ్లడం మానేశారు. జనాలు ఎక్కువగా ఉన్న చోట కరోనా వ్యాప్తి జరుగుతుందన్న వార్తలు రావడంతో చాలా మంది థియేటర్లకు వెళ్లడం మానేశారు. దాంతో ఇప్పుడు కొన్ని చిత్రాలకు కోరానా ఎఫెక్ట్ భారీగానే పడిందని అంటున్నారు. ఈ కోవలోకే భీష్మ వస్తుంది.
'భీష్మ' చిత్రం మొదటి షో నుండే హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ చిత్రం ఫస్ట్ వారం బ్రేక్ ఈవెన్ కొట్టి.. లాభాల బాట పట్టింది. రెండో వారం కూడా మంచి కలెక్షన్లు రాబట్టినప్పటికీ చిన్నగా డల్ కావడం ఆరంభం అయ్యింది. ఇదే సమయంలో విద్యార్థులకు ఎగ్జామ్స్.. మరో వైపు కరోనా ఎఫెక్ట్ వెరసి భీష్మపై భారీగానే ప్రభావం చూపించిందని అంటున్నారు. లేదంటే 35 కోట్లు కొల్లగొట్టాల్సిన భీష్మ ఇప్పుడు 25 కోట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదే డిసెంబర్ లేదా వేసవిలో ఈ సినిమా వస్తే.. ఖచ్చితంగా భీష్మ 40 కోట్ల షేర్ దగ్గర ఆగేది.