బన్నీ - సుకుమార్ సినిమాకి టైటిల్ అదేనా..?
'అల వైకుంఠపురంలో' చిత్ర విజయంతో మంచి ఊపు మీదున్న అల్లు అర్జున్ అదే ఊపుతో సుకుమార్ దర్శకత్వంలో తన కెరీర్లో 20వ మూవీని పట్టాలెక్కించాడు. డైరెక్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ అంటే మనకు గుర్తొచ్చే సినిమా ‘ఆర్య’. వాస్తవానికి అల్లు అర్జున్కు స్టార్ డమ్ను తీసుకొచ్చిన సినిమా కూడా ఇదే. ఆ తరవాత వీరిద్దరి కాంబినేషన్లో ‘ఆర్య 2’ వచ్చినా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ జతకట్టారు. మైత్రీ మూవీస్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తమిళ హీరో విజయ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మదన్న హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం. ఈ సినిమా కోసం బన్నీ తన వేషం, భాష మార్చుకోవాల్సి వచ్చింది.
గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవరుగా కనిపిస్తారని సమాచారం. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ జరగాల్సింది. కానీ అల్లు అర్జున్ మాక్ ఓవర్ కోసం, బన్నీ చిత్తూర్ స్లాంగ్ కోసం, కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ ఆలస్యమైంది. ఈ చిత్రానికి సింహాచలం అనే పేరు పెట్టారని అప్పట్లో వార్తలొచ్చాయి. వాటిని చిత్రబృందం ఖండించింది కూడా. ఇప్పుడు ఈ సినిమాకి సరికొత్త టైటిల్ రెడీ అయిపోయిందట. బన్నీ – సుక్కు కాంబినేషన్లో `ఆర్య`, `ఆర్య 2` వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా రెండక్షరాల టైటిల్ నే ఖరారు చేశారట. ఓ అమ్మాయి పేరుని ధ్వనించేలా ఆ టైటిల్ ఉంటుందని టాక్. టైటిల్ లోగో కూడా సిద్ధమైపోయింది. ఈనెల 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు ఈ సందర్భంగా ఈ టైటిల్ని ప్రకటించే అవకాశం ఉంది. మరి ఆ రెండక్షరాల టైటిల్ ఏమిటో తెలియాలంటే అప్పటి వరకూ ఆగాల్సిందే. వచ్చే ఏడాది రిలీజ్ కాబోయే ఈ సినిమా ఎన్ని రికార్డులను కొల్లగొడుతుందో చూడాలి.