నాని, గ్యాంగ్ లీడర్ తో తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్. అయితే ఈ సినిమా విజయం సాధించకపోవడంతో తెలుగులో బిజీ కాలేకపోయింది ప్రియాంక. ప్రస్తుతం గ్యాంగ్ లీడర్ తరువాత శర్వానంద్ తో శ్రీకారంలో నటిస్తున్న ఆమె తమిళం లో శివ కార్తికేయన్ సరసన డాక్టర్ లో కూడా నటిస్తుంది. ఇక ఈ రెండు సినిమాలే కాకుండా తాజాగా మరో ఆఫర్ ను పట్టేసిందని సమాచారం. 2018కిగాను ఉత్తమ జాతీయ చిత్రంగా నిలచిన బాలీవుడ్ మూవీ అందదున్ తెలుగులో రీమేక్ కానున్న విషయం తెలిసిందే. ఈచిత్రంలో నితిన్ సరసన ప్రియాంక మోహన్ నటించనుందట. మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రం జూలై నుండి సెట్స్ మీదకు వెళ్లనుండగా డిసెంబర్ లో విడుదలకానుంది. నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ ఈ సినిమా ను నిర్మించనుంది.
ఇదిలావుంటే వరస పరాజయాల తరువాత ఇటీవల భీష్మ తో వచ్చి హిట్ కొట్టిన నితిన్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో తొలి ప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రంగ్ దే ఒకటి. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరక్కుతున్న ఈ చిత్రం ఇప్పటివరకు 80 శాతం కు పైగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా తోపాటు నితిన్ ప్రస్తుతం సాహసం ఫేమ్ చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ లో కూడా నటిస్తున్నాడు. ఈచిత్రానికి చెక్ అనే టైటిల్ ప్రచారం లో వుంది. భవ్య క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.