కరోనా .. సినీ రంగం పై తీవ్ర ప్రభావం చూపించింది. పనులు లేక అటు సినీ కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే విడుదలకావల్సిన సినిమాలు అన్ని వాయిదాపడ్డాయి దాంతో అప్పులు తెచ్చి సినిమాలను నిర్మించిన నిర్మాతలు దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. ఇక ఈ కరోనా వల్ల సినిమా రంగంలో అనేక మార్పులు చోటుచేసుకోవడం ఖాయం. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణం ఇప్పట్లో లేనట్లే .. పారితోషికాల విషయంలోనూ కోత గ్యారెంటీ. అయితే నిర్మాతల పరిస్థితి అర్ధం చేసుకున్న కొంత మంది హీరోలు, డైరెక్టర్లు నిర్మాతలకు అండగా ఉండడానికి స్వచ్ఛందంగా పారితోషికాలను తగ్గించుకుంటున్నారు. అందులో భాగంగా కోలీవుడ్ మీడియం రేంజ్ హీరోలు విజయ అంటోనీ, హరీష్ కళ్యాణ్ తమ తదుపరి ప్రాజెక్ట్ ల కోసం 25 శాతం పారితోషికం తగ్గించుకుంటున్నామని అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ జాబితాలో స్టార్ డైరెక్టర్ హరి కూడా చేరాడు. తను చేయబోయే తదుపరి సినిమాకు 25శాతం పారితోషికం తగ్గించుకున్నట్లు హరి ఓ లేఖ ద్వారా వెల్లడించాడు.
ప్రస్తుతం హరి , స్టార్ హీరో సూర్య తో అరువా అనే సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. సింగం సిరీస్ తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఆరువా పై భారీ అంచనాలు వున్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించనుంది. జులై లేదా ఆగస్టు లో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.