దేవీ ప్రాణం పెడుతున్నాడా ?
దేవీశ్రీ ప్రసాద్. యూత్ గుండె చప్పుడుగా ఒకప్పుడు ఎన్నో మ్యూజికల్ ఆల్బమ్స్ ఇచ్చి మ్యాజిక్ చేసిన మాంత్రికుడు. టాప్ హీరోల ఫస్ట్ చాయిస్ గా దేవీ ఉండేవాడు. అలాగే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ల ఫేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. దేవీ ఉంటే చాలు సూపర్ హిట్ అన్న టాక్ తెచ్చుకున్న యువ సంగీత తరంగం అయితే ఇదంతా గతం. ఇపుడు దేవీకి రోజులు కలసిరావడంలేదు.
ఇపుడు థమన్ యుగం నడుస్తోంది. గత ఏడాది, ఈ ఏడాది కూడా తనదేనని రాసి పెట్టుకున్నాడు థమన్. ఆ విధంగానే హిట్ల మీద హిట్లు కొడుతూ కేక పెట్టిస్తున్నాడు. థమన్ అల వైకుంఠపురంలో మూవీ, దేవీ సరిలేరు నీకెవ్వరూ మూవీ రెండు ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి. అయితే దేవీ మీద థమన్ గెలిచేశాడు. ఇప్పటికీ అల పాటలు అలా మారుమోగుతూ యూ ట్యూబ్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.
ఇక పెద్ద సినిమాలు ఎన్నో చేతిలో థమన్ కి ఉంటే దేవీ చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది. అదే అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వస్తున్న మూవీ పుష్ప. ఈ మూవీ కూడా సుకుమార్ పంతం వల్లనే దేవీకి దక్కిందని అంటారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ని అల్లు అర్జున్ రికమండ్ చేశారని టాక్. అయితే తనకు దేవీతో కంఫర్ట్ గా ఉంటుందని, అతన్నే తీసుకుంటానని సుక్కూ కన్వీన్స్ చేయడంతో బన్నీ ఓకే అనాల్సివచ్చిందని అంటున్నారు.
ఇలా వచ్చిన ఈ మూవీ దేవీ జాతకాన్ని మార్చనుందా లేదా అన్నది పెద్ద డిస్కషన్.ఈ మూవీ కోసం దేవీ ప్రాణం పెడుతున్నాడని టాక్. రంగస్థలం మూవీని సూపర్ డూపర్ హిట్ చేసిన దేవీ సుక్కూ అన్ని సినిమాలకు బెస్ట్ మ్యూజిక్ నే ఇప్పటిదాకా ఇచ్చాడు. ఇద్దరూ బాగా ట్యూనప్ అవుతారు. అందుకే ఈ కాంబో మీద అంచనాలు చాలానే ఉన్నాయి.
పైగా దేవీకి ఇది చాల కీలకమైన పాయింట్. దాంతో తానేంటో మళ్ళీ ప్రూవ్ చేసుకోవడానికి పుష్పను వాడుకుని విరగదీస్తాడని అంటున్నారు. పుష్ప పాన్ ఇండియా మూవీగా రెడీ అవుతోంది. ఈ మూవీ మ్యూజిక్ కచ్చితంగా హిట్టేనని ఇప్పటి నుంచే లెక్కలు వేస్తున్నారు. అది ఎంత పెద్ద హిట్ అన్నది మాత్రం రేపటి మ్యూజిక్ రిలీజ్ తరువాత మూవీ రిలీజ్ తరువాత తెలుస్తుంది. ఏది ఏమైనా పుష్పతో మళ్లీ దేవీ కమింగ్ బ్యాక్ అనిపిస్తాడని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.