స్నేహం కోసం ఏమైనా చేయొచ్చని నిరూపించిన రామ్!!
స్నేహం ఒక అద్భుతమైన బంధం. మంచి మిత్రుడు తోడుంటే ఎంతటి క్లిష్ట పరిస్థితులైనా ధైర్యంగా ఎదుర్కోగలం. ప్రతిఫలాన్ని ఆశించని ఈ స్నేహ బంధం మొగ్గలా ప్రారంభమై.. మహావృక్షంగా ఎదిగి జీవితాంతం తోడునిస్తుంది. ఇక ఈ స్నేహం కాన్సెప్ట్ పై ఇప్పటికే ఎన్నో సినిమాలు ప్రేక్షకులను రంజింప చేశాయి. అయితే అందులో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన `ఉన్నది ఒకటే జిందగీ` సినిమా కూడా ఒకటి. దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు కీలక పాత్ర పోషించాడు.
ప్రేమ, స్నేహం మధ్య ప్రధానంగా సాగిందీచిత్రం. అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించారు. ఫ్రెండ్స్ షిప్ అంశాన్ని ప్రధానంగా చేసుకొని రూపొందించిన ప్రేమ కథా చిత్రం ఉన్నది ఒకటే జిందగీ. హీరో ఒకమ్మాయిని ప్రేమిస్తాడు.. హీరోయిన్ కూడా అతడిని ఇష్టపడ్డట్లే కనిపిస్తుంది.. అంతలో తన ఫ్రెండు కూడా అదే అమ్మాయిని ఇష్టపడుతున్నట్లు హీరోకు తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితి చాలా సినిమాల్లో చూసి ఉంటాం. సాధారణంగా ఏ సినిమాలో అయినా ఇలాంటి పరిస్థితి ఎదురైనపుడు హీరో తన ఫ్రెండుకి విషయం చెప్పకుండా దాచేస్తాడు. అయితే ఉన్నది ఒకటే జిందగీ చిత్రంలో మాత్రం అందుకు భిన్నంగా.. రామ్ తన ఫ్రెండ్ శ్రీ విష్ణుకు అసలు విషయం చెబుతాడు.
ఇద్దరూ కలిసి పక్కపక్కన కూర్చుని అనుపమకు ఒకేసారి ప్రపోజ్ కూడా చేస్తారు. అయితే అనుపమ రామ్నే ప్రేమించినప్పటికీ.. రామ్ మాత్రం శ్రీ విష్ణు కోసం.. తన ప్రేమను త్యాగం చేస్తాడు. ఈ క్రమంలోనే రామ్ అందిరకీ దూరంగా వెళ్లిపోతారు. ఇక ఆ తర్వాత రామ్, శ్రీవిష్ణు ఎలా కలిశారన్నదే సినిమా. అయితే ఈ చిత్రంలో స్నేహం కోసం ఏమైనా చేయొచ్చని రామ్ నిరూపించాడు. అటు శ్రీవిష్ణు కూడా అదే చేస్తాడు. ఫ్రెండ్ అంటే ప్రాణమిచ్చే స్నేహితుడిగా, ప్రియురాలు దూరమైన ప్రేమికుడిగా మంచి నటన కనబరిచాడు. స్నేహానికి అసలు సిసలైన అర్థాన్ని చెప్పారు. అందుకే ఈ చిత్రం ముఖ్యంగా యూజ్ను బాగా ఆకట్టుకుంది. ఇక రొటీన్ కథలో పాత్రలను డిజైన్ చేసుకొన్న తీరు ఈ సినిమాకు ప్లస్ అయింది. అంతేకాకుండా దర్శకుడి ప్రతిభకు అద్ధంపట్టింది.