పవన్ కళ్యాణ్ సినిమాలు అటకెక్కినట్టేనా... షాక్ లో ఫ్యాన్స్....?

Reddy P Rajasekhar

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తరువాత సినిమాలకు దూరమై రాజకీయాలకు పూర్తిసమయం కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే రాజకీయాల్లో పవన్ కు నిరాశజనకమైన ఫలితాలే వచ్చాయి. రెండు స్థానాల్లో పోటీ చేసినా వైఎస్సార్సీపీ అభ్యర్థుల చేతిలో ఆయన ఓటమిపాలయ్యారు. జనసేన పార్టీ ఒక స్థానంలో గెలిచినా పార్టీ అధినేత ఓడిపోవడం అభిమానులకు షాక్ ఇచ్చింది. దీంతో పవన్ సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వాలని అభిమానులు ఆకాక్షించారు. 
 
ఎన్నికలు ఫలితాలు వెలువడిన కొన్ని నెలల తర్వాత పవన్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా వకీల్ సాబ్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అన్నీ అనుకున్న విధంగా జరిగి ఉంటే మే నెలలోనే ఈ సినిమా విడుదలయ్యేది. మొదటి రోజు లీకైన వకీల్ సాబ్ కు సంబంధించిన ఒక పిక్ జాతీయస్థాయిలో ట్రెండ్ అయిందంటే అభిమానులు ఈ సినిమా కోసం ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారో సులభంగా అర్థమవుతుంది. 
 
అయితే కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల సినీ పరిశ్రమ మొత్తం మూతబడింది. షూటింగులు బంద్ కావడంతో ప్రభుత్వాలతో చర్చించి నిర్మాతలు షూటింగులకు అనుమతులు తీసుకున్నారు. అయితే స్టార్ హీరోలు మాత్రం షూటింగులకు దూరంగా ఉంటున్నారు. వకీల్ సాబ్ కొంత పార్ట్ పూర్తి కావాల్సి ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు అభిమానులను మరింత టెన్షన్ పెడుతున్నాయి. 
 
ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చినప్పటికీ షూటింగ్ చేసే పరిస్థితులు లేవని... ముఖ్య నటులకు కరోనా సోకితే యూనిట్ మొత్తం ఇబ్బందులు పడాల్సి ఉంటుందని... వ్యాక్సిన్ వచ్చే వరకు నిస్సహాయతతో అంతా వెయిట్ చేస్తూ ఉండాల్సిందేనని అన్నారు. పవన్ - క్రిష్, పవన్ - హరీష్ శంకర్ కాంబినేషన్లో సినిమాలు మొదలు కావాల్సి ఉన్నా తాజాగా పవన్ కామెంట్లను బట్టి చూస్తే ఆ సినిమాలు అటకెక్కినట్లేనని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: