ప్రభాస్ ని వెంటాడుతున్న నెగెటివ్ సెంటిమెంట్..

Deekshitha Reddy
బాహుబలి తర్వాత హీరో ప్రభాస్ పై సెంటిమెంట్లు బాగా పనిచేశాయి. బాహుబలి పాన్ ఇండియా సినిమా కావడంతో అప్పటికే సుజిత్ దర్శకత్వంలో ఫైనల్ చేసిన సాహో సబ్జెక్ట్ ని పూర్తిగా మార్చేశారు. నేలవిడిచి సాము చేశారు. అంచనాలను అందుకోడానికి సాహో కలగాపులగం కావడంతో రిజల్ట్ తేడా కొట్టేసింది. ఆ తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా రాధే శ్యామ్. దీన్ని కూడా పాన్ ఇండియా స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు. అయితే ఇక్కడే సాహోకి, రాధేశ్యామ్ కి ఓ పోలిక ఉంది. ఆ కంపేరిజన్ వల్లే ప్రభాస్ అభిమానులు కాస్త టెన్షన్ పడుతున్నారు.
సాహో సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ల విషయంలో పెద్ద గందరగోళం ఏర్పడింది. శంకర్ ఎహషాన్ లాయ్ త్రయంతోపాటు, జిబ్రాన్ ఈ సినిమాకు సంగీతాన్నిచ్చారు. ఈ సినిమాకు ఇంకా చాలామంది సంగీతాన్నందించినట్టు కూడా పేర్లు వినిపిస్తాయి. పేర్లు ఎన్ని ఉన్నా... సాహో సంగీతం పెద్దగా ఎవర్నీ ఆకట్టుకోలేకపోయింది. తెలుగులోనే కాదు, ఇతర భాషల్లో కూడా సాహో మ్యూజికల్ గా హిట్ కాలేకపోయింది. ఆ తర్వాత సినిమాకి కూడా పెద్దగా రెస్పాన్స్ రాకపోవడంతో ఇక మ్యూజిక్ పూర్తిగా మరుగునపడిపోయింది.
ఇప్పుడిక రాధేశ్యామ్ వంతు. ఈ సినిమా షూటింగ్ మొదలైంది. యూరప్ షెడ్యూల్ పూర్తయింది, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ ఫైనల్ కాలేదు. అమిత్ త్రివేది అన్నారు, ఏఆర్ రెహ్మాన్ అంటున్నారు, ఇంకెవరితోనో సీక్రెట్ గా ట్యూన్స్ కట్టిస్తున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలింత పెద్ద సినిమాపై ఏంటీ గందరగోళం. మ్యూజిక్ డైరెక్టర్ ని ఇప్పటి వరకూ ఎందుకు ఫైనల్ చేసుకోలేకపోతున్నారు. తెలుగులో అంత గొప్ప సంగీత దర్శకులు లేరా? పోనీ ఏరికోరి అందర్నీ తీసుకొచ్చి కలగూరగంపలా చేస్తే సాహో రిజల్ట్ ఎలా ఉందో చూశాం కదా. ఈ గందరగోళంతోనే ప్రభాస్ అభిమానులు ఇబ్బంది పడుతున్నారు. సాహో మ్యూజిక్ నెగెటివ్ సెంటిమెంట్ రాధేశ్యామ్ ని కూడా వెంటాడుతుందని భయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: