బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ను అత్యాచారం చేస్తానంటూ బెదిరించిన లాయర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తన ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయిందని, ఆ న్యాయవాది తెలియజేయడంతోపాటు, కంగనపై పెట్టిన పోస్టింగ్ కి తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. ఈ మేరకు సదరు న్యాయవాది ఓ పోస్ట్ పెట్టారు. ‘నా ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ చేసి దాని నుంచి అసభ్యకరమైన కామెంట్లు పెట్టారు. నా స్నేహితుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకుని షాక్ కి గురయ్యా. నాకు స్త్రీలు, సమాజం పట్ల గౌరవం ఉంది. నా అకౌంట్ నుంచి వచ్చిన అసభ్యకరమైన కామెంట్స్ వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించండి’ అని పోస్ట్ పెట్టారు లాయర్. అలా పోస్ట్ పెట్టిన కొద్ది సమయానికే ఆయన తన ఫేస్బుక్ అకౌంట్ డిలీట్ చేశారు కూడా. ఆ వెంటనే ఆ లాయర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని సమాచారం.
ప్రస్తుతం కంగనా రనౌత్ తన సోదరుడి పెళ్లి వేడుకల్లో బిజీగా ఉన్నారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఆమె అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోలకు ఒడిశాకు చెందిన న్యాయవాది నుంచి అత్యాచార బెదిరింపులతో కూడిన కామెంట్స్ వచ్చాయి. ‘నడిరోడ్డుపై అత్యాచారం చేస్తా’ అంటూ వచ్చిన కామెంట్స్ చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. అయితే కంగనా రనౌత్ మాత్రం ఆ కామెంట్స్ పై స్పందించలేదు.
కంగన స్పందించకపోయినా.. ఆమె అకౌంట్ ని ఫాలో అవుతున్నవారికి అత్యాచార కామెంట్స్ కనపడ్డాయి. ఈ కామెంట్స్ హైలెట్ కావడంతో.. ఆ న్యాయవాది ఎవరా అని అందరూ ఆరా తీయడం మొదలు పెట్టారు. దీంతో ఆ లాయర్ ఒడిశాకు చెందిన వ్యక్తి అని తేలింది. ఆ వెంటనే అతను తేరుకున్నాడు. తన ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయిందని చెబుతూ ఆ అకౌంట్ ని డిలీట్ చేశాడు. ఆ తర్వాత సదరు లాయర్ ఎవరికీ అందుబాటులో లేరని తేలింది. ఒకవేళ నిజంగానే లాయర్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాకింగ్ కి గురయిందా లేక, కావాలనే అతడు కామెంట్స్ పెట్టి డిలీట్ చేశాడా అనే విషయం సస్పెన్స్ గా మారింది.