గోపీచంద్ కరోనాకి భయపడ్డారా..?

Deekshitha Reddy
హీరో గోపీచంద్ చాన్నాళ్లుగా హిట్ మూవీకోసం ఎదురు చూస్తున్నారు. వరసబెట్టి సినిమాలు చేస్తున్నా కెరీర్ ని గాడిలో పెట్టే హిట్ ఒక్కటీ పడటంలేదు. అయితే సినిమా సినిమాకీ గోపిచంద్ నటుడిగా ప్రూవ్ చేసుకుంటున్నారు, మంచి సినిమాలు చేస్తున్నారనే పేరు కూడా వస్తోంది. హిట్ ఒక్కటే అందని ద్రాక్షలా మారింది. తాజాగా సీటీమార్ సినిమాతో మాంచి మాస్ హిట్ కొడతామనుకుంటున్న గోపీచంద్ రిలీజ్ డేట్ దగ్గరపడేసరికి వెనకడుగేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. సినిమా హాళ్లంటే జనాలు భయపడే పరిస్థితుల్లో సీటీమార్ వాయిదా వార్త బయటకొచ్చింది.

ఏప్రిల్ 2న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ లేటవుతోందని, అందుకే సినిమా విడుదల వాయిదాపడిందని చెబుతోంది చిత్ర యూనిట్. కానీ కరోనాయే అసలైన కారణం అని మరికొంతమంది చెబుతున్నారు. కరోనా వల్ల ప్రేక్షకుల సందడి తక్కువగా ఉంటుందని, అందుకే చిత్ర బృందం వెనకడుగు వేసిందని అంటున్నారు. ఈ వార్తల్లో వాస్తవం ఎంతుందో తెలియదు కానీ.. వెనకడుగేయడం మాత్రం మంచిదేనని చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్లు హౌస్ ఫుల్ కావడం కష్టంగానే మారింది. అందులోనూ కరోనా కేసులు పెరిగితే.. ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ రేషియో అమలులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో హడావిడిగా ఇప్పుడు రిలీజ్ చేయడంకంటే.. కొన్నిరోజులు వేచి చూస్తే, పరిస్థితి చక్కబడ్డాక థియేటర్లోకి వస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

‘సీటీమార్‌’ సినిమాలో గోపీచంద్ ఆంధ్రా కబడ్డీ టీమ్ కి కోచ్ గా కనిపించబోతున్నాడు. తెలంగాణ టీమ్ కోచ్ గా తమన్నా నటించింది. భూమిక మరో కీలక పాత్రలో కనిపిస్తుంది. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్నిచ్చారు. ఇప్పటికే విడుదలైన పాటలు వినసొంపుగా ఉన్నాయి. ట్రైలర్ మరీ ఆసక్తికరంగా లేకపోయినా.. మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా సినిమా తెరకెక్కించినట్టు అర్థమవుతోంది. చాన్నాళ్లుగా హిట్ కోసం ఎదురు చూస్తున్న గోపీచంద్ ఈ సినిమాతో అయినా ట్రాక్ లో పడదామని ఆశలు పెట్టుకున్నారు. అయితే సినిమా వాయిదా పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: