కరోనా భయంతో ఊరొదిలి పారిపోయిన నటి...?

VAMSI
కరోనా కష్టకాలం మళ్ళీ మొదలైంది. కాస్త గ్యాప్ ఇచ్చి తిరిగి తన ఉదృతిని కొనసాగిస్తూ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది కరోనా. సెకండ్ వేవ్ తో కరోనా ఈజ్ బ్యాక్ అంటూ కలవరపెడుతోంది. ఈ మహమ్మారికి నిరుపేదల నుండి బడా బడా కోటీశ్వరుల వరకు, సామాన్యుల నుండి మహా సెలబ్రిటీల వరకు అందరూ సమానులే... అజాగ్రత్త వహిస్తే చాలు ఎవరినైనా సరే తన కబంధహస్తాలతో కమ్మేసి మరణతీరాలకు చేరుస్తుంది. ఇక కరోనా సోకిందంటే అది తగ్గేంతవరకు.. వారి నుండి ఇతరులకు వ్యాప్తి చెందకుండా విడిగా ఉండాల్సిన అవసరం ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇది అందరికీ సాధ్యమయ్యే పనికాదు.

అదే విధంగా కరోనా సోకకుండా ఉండడం కోసం నగరాలను సైతం విడిచి దూరంగా బస చేసే సెలబ్రెటీలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్టులో రెండోసారి చేరి  హాట్ టాపిక్ గా మారారు నటి నీనా గుప్తా. మొదట్లో కరోనా విజృంభిస్తున్న వార్తలు విని..నైనిటాల్‌కు దగ్గరగా ఉండే ముక్తేశ్వర్‌లోని తన గెస్ట్ హౌస్ కి షిఫ్ట్ అయ్యింది. ఆ తర్వాత దాదాపు ఏడెనిమిది నెలలు అక్కడే బస చేసిన ఆమె.. ఆ తర్వాత కరోన ఉధృతి తగ్గడంతో తిరిగి ముంబైకి చేరుకున్నారు. సల్మాన్‌ ఖాన్‌ గత సంవత్సరం నుంచి దాదాపుగా తన పాన్వెల్‌ ఫామ్‌హౌస్‌లోనే ఉంటున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ కరోనా సెకండ్ వేవ్ ముంబై మహానగరాన్ని వణికిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లోని పలువురు సెలబ్రిటీలు కరోనా సెకండ్ వేవ్ బారిన పడినట్లు  సమాచారం. తాజాగా విలన్‌ అశుతోష్‌ రాణాకు కరోనా పాజిటివ్‌ వచ్చింది.

అయితే ఈ వార్తలు విన్న నటి నీనా గుప్తా  ఇక్కడ ఏ మాత్రం సేఫ్ కాదని మళ్లీ ముక్తేశ్వర్‌ లో ఉన్న తన వసతి గృహానికి వెళ్ళిపోయింది. అక్కడికి చేరుకున్న ఆమె... కొన్ని విషయాలను తెలిపింది. ఆమె ఏమన్నారంటే...ఇక్కడి ప్రజలు, వాతావరణం ఎంతో ప్రశాంతంగానూ మరియు ఆహ్లాదకరంగా  ఉంటాయి. అయితే ఇక్కడ ఉతికిన గుడ్డలను బయట ఆరవేయడం వారికి నచ్చదు. బట్టలు బాగా ఎండకు ఆరితే తప్ప నాకు అవి ఆరినట్టుగా, ఫ్రెష్ గా ఉన్నట్లుగా అనిపించదు. అయినా బట్టలు ఉతికి ఆరేస్తేనే కదా అది ఇల్లు అనే భావన వస్తుంది... కానీ ఇక్కడ అది కుదరడం లేదు అంటూ చెప్పుకొచ్చింది.  ఇది విన్న ఆమె ఆప్తులు, అభిమానులు బట్టలు విషయం అటుంచితే... మీరు అక్కడికి చేరుకోవడం మంచి పని.  స్టే సేఫ్ ..స్టే హెల్దీ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: