కరోనాకి ప్రముఖ నటుడు బలి
తమిళ సూపర్ హిట్ సినిమా అయిన అసురన్ లో పాండియన్ పాత్రలో ఫేమస్ అయిన నటుడు నితీష్ వీర సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. 45 ఏళ్ల నటుడు నితీష్ వీర చెన్నై ఒమండురార్ ఆసుపత్రిలో కోవిడ్ -19తో చికిత్స పొందుతున్నారని అంటున్నారు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో 2006లో వచ్చిన పుదుపేట్టై సినిమాతో నితీష్ నటుడిగా తన కెరీర్ ప్రారంభించారు. ధనుష్తో పాటు నార్త్ మద్రాస్ గ్యాంగ్స్టర్గా తన నటనతో అతను అందరినీ ఆకట్టుకున్నాడు.
ఆ తరువాత సింధానై సై మరియు వెన్నిలా కబాడి కుజు వంటి మల్టీస్టారర్లలో కూడా ప్రధాన పాత్రలలో నటించారు. 2018 లో పా రంజిత్ దర్శకత్వం వహించిన కాలా సినిమాలో రజనీకాంత్ పెద్ద కుమారుడిగా వీర నటించారు. తరువాతి సంవత్సరం ఆయన నటించిన ఆరు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక వెట్రి మారన్ డైరెక్షన్ లో వచ్చిన అసురన్ సినిమాలో కుల పిచ్చి నిండిన అకౌంటెంట్గా ఆయన చేసిన పాత్ర అతనికి పెద్ద ఎత్తున గుర్తింపు తెచ్చిపెట్టింది. విజయ్ సేతుపతి, శ్రుతి హాసన్ నటిస్తున్న లాభం సినిమాలో కూడా ఈ నటుడు కీలక పాత్ర పోషించినట్లు చెబుతున్నారు.