సినిమా విడుదల సమయంలో సోషల్ మీడియా ప్రమోషన్లు ఇప్పుడు సాధారణమయ్యాయి. చిత్ర నిర్మాతలు తమ సినిమాలను ఎవరూ ఊహించని రీతిలో ప్రమోట్ చేస్తున్నారు. ఇక ఈ ప్రమోషన్స్ కోసం పెద్ద ఎత్తున ఖర్చు కూడా చేస్తున్నారు. ఇక ఈ మధ్య సినిమాలను ప్రమోట్ చేయడానికి గాను ఒక నిర్దిష్ట శైలిని అనుసరించడానికి ప్రయత్నిస్తున్నారు. సినిమా ఎక్కువమందికి రీచ్ అవ్వాలంటే తమ చిత్రానికి ఎమోజిని ట్విట్టర్లో పొందడం ద్వారా కొత్త శైలిని ప్రవేశపెట్టారు చిత్రనిర్మాతలు.
ఇప్పటికే ఈ ట్విట్టర్ ఎమోజి ఎక్కువగా తమిళ సినిమాలకు దక్కగా ఇప్పుడు ఆ బాటలోనే జగమే తంతిరం సినిమాకి కూడా ఒక ఎమోజీ వచ్చింది. ధనుష్, ఐశ్వర్యలక్ష్మీ, జోజు జార్జ్, కలైయారసన్, శరత్ రవి, జేమ్స్ కాస్మో ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జగమేతంతిరం’. షూట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల విషయంలో కొన్నాళ్లుగా సందిగ్ధత నెలకొని ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ‘జగమే తంతిరం’ ట్రైలర్ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ విడుదల చేసింది. విడుదలైన కొన్ని గంటలలోనే ఈ ట్రైలర్ ట్రెండింగ్లో నిలుస్తూ అద్భుతమైన రెస్పాన్స్ రాబట్టుకుంటోంది.
కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమిళ గ్యాంగ్స్టర్ పాత్రలో ధనుష్ నటించారు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, వై నాట్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా జూన్ 18న నెట్ఫ్లిక్స్లో ప్రసారం చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఆ రోజు నుంచే సినిమా వీక్షకులకు అందుబాటులో ఉంటుంది. ఓ స్లంలో ఉండే వ్యక్తి అంతర్జాతీయ గ్యాంగ్స్టర్గా ఎలా మారాడు? ఇందుకు దారి తీసిన పరిస్థితులేంటి? అనేదే ఈ సినిమా చిత్రం మూల కథ.