అసలు మనం మనుషులమేనా.. రక్తం మరిగిపోతుంది : రకుల్
ప్రస్తుతం కరోనా వైరస్ కాలంలో మనిషికి మనిషి తోడు అని చెబుతున్నారు అందరూ. కానీ కష్టకాలంలో కూడా కామంతో కళ్లు మూసుకుపోయిన మానవ మృగాలు రెచ్చిపోతూనే ఉన్నారు. ఆడపిల్ల కనిపిస్తే చాలు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. రోజురోజుకు ఇలా ఆడ పిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు వెలుగులోకి వచ్చి అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఆడపిల్లలకు రక్షణ మాత్రం దొరకడం లేదు. ఆడపిల్ల జీవితం మొత్తం అడుగడుగునా లైంగిక వేధింపులు అత్యాచారాలతో దుర్భరంగా మారిపోతుంది. అయితే ఇటీవల దేశంలో నెలకొన్న పరిస్థితులపై టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తీవ్రంగా స్పందించింది.
ప్రస్తుతం దేశం మొత్తం కరోనా వైరస్ కోరల్లో చిక్కుకొని అల్లాడిపోతూ ఉంటే... ఎంతోమంది ప్రాణాలు పోయి ఎన్నో కుటుంబాలు విషాదంలో మునిగి పోతుంటే .. మరోవైపు కామంతో కళ్లు మూసుకుపోతున్న మానవ మృగాలు మాత్రం ఆడపిల్లలపై అత్యాచారాలు ఆపడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది రకుల్. ఇటీవలే మనేసర్ లో జరిగిన అత్యాచారం ఘటన గురించి చదవగానే తన రక్తం మరిగి పోయింది అంటూ చెప్పుకొచ్చింది. ఇలాంటి వార్తలు చదువుతున్నప్పుడు అసలు మనం మనుషులమేనా అనే అనుమానం కలుగుతుంది అంటూ రకుల్ ప్రీత్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.