అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లోనూ సినిమా చేస్తూ రౌడీ హీరో తన క్రేజ్ ను దేశవ్యాప్తంగా పెంచుకుంటున్నాడు. విజయ్ దేవర కొండ అర్జున్ రెడ్డి కంటే ముందు పెళ్లి చూపులు సినిమా విడుదలైంది. అయితే ముందు షూటింగ్ మాత్రం అర్జున్ రెడ్డి సినిమాదే పూర్తయ్యిందట. కానీ కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా పడటంతో పెళ్లి చూపులు సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా ఆ తరవాత అర్జున్ రెడ్డి సినిమాతో వచ్చాడు. ఇక పెళ్లి చూపులు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినా రౌడీ హీరోకు మంచి పేరు తెచ్చిపెట్టింది. నిజానికి పెళ్లి చూపులు సినిమాతోనే ప్రేక్షకులు విజయ్ కి అభిమానులు అయ్యారు.
ఇక ఆ తరవాత అర్జున్ రెడ్డి రావడం ఆ సినిమా అంచనాలకు మించి ఉండటంతో యూత్ అంతా అర్జున్ రెడ్డి జపం చేశారు. ఇది ఇలా ఉంటే ఆ తరవాత వెంటనే గీతా గోవిందం లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా రౌడీ హీరో తనవైపు తిప్పుకున్నారు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడంతో విజయ్ దేవరకొండ ఫుల్ బిజీగా మారిపోయాడు. ఇక ఇప్పుడు ఏకంగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాత్ తో పాన్ ఇండియా సినిమాలో అవకాశం దక్కించుకున్నాడు.
అంతే కాకుండా వీదిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న లైగర్ సినిమాలో బాలీవుడ్ నిర్మాతలు కూడా భాగమవ్వడం విజయ్ దేవరకొండకు మరో ప్లస్ అయ్యింది. ఇక ఇప్పటికే లైగర్ సినిమా నుండి ఫస్ట్ లుక్ విడుదల చేయగా దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే రౌడీ హీరో రౌడీ వేర్ అంటూ దుస్తుల బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే రౌడీ వేర్ కు పెద్దగా ఆదరణ లేదు గానీ ఇప్పుడు మరో బిజినెస్ లోకి దేవరకొండ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. ఏషియన్ సినిమాస్ తో ఒప్పందం చేసుకున్న రౌడీ మహబూబ్ నగర్ లో ఏవీడి థియేటర్ లను ప్రారంభిస్తుండగా ఈ థియేటర్ ను లవ్ స్టోరీ సినిమాతోనే ప్రారంభించనున్నారట.