మణిరత్నం గట్టెక్కుతాడా..? ఆ సినిమాపైనే బోలెడన్ని ఆశలు..!
మణిరత్నం సరైన హిట్ కొట్టి చాలాకాలం అయింది. కార్తీ, అదితారావు హైదరీ లీడ్ రోల్స్లో వచ్చిన 'కాట్రువెలియిదై', అరవింద్ సామి, శింబు, విజయ్ సేతుపతి నటించిన 'చెక్క చివంత వానమ్' సినిమాలు ఫ్లాప్ అయ్యాక మణిరత్నం పనైపోయిందనే కామెంట్స్ వచ్చాయి. ఇలాంటి విమర్శల మధ్యలో 'పొన్నియన్ సెల్వన్' అనే భారీ హిస్టారికల్ డ్రామా మొదలుపెట్టాడు.
చోళులకాలంనాటి కథాంశంతో తెరకెక్కుతోంది 'పొన్నియన్ సెల్వన్'. లైకా ప్రొడక్షన్స్తో కలిసి మణిరత్నం ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. భారీ బడ్జెట్తో రూపొందుతోన్న ఈ మూవీతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ప్రయత్నిస్తున్నాడు మణిరత్నం.
'పొన్నియన్ సెల్వన్' సీరీస్లో మొదటిభాగం సమ్మర్లో రిలీజ్ అవుతుందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మూవీని మణిరత్నం వేసవిలో విడుదల చేయడం లేదట. జులై లాస్ట్ వీక్లోగాని, ఆగస్ట్ సెకండ్వీక్లో గానీ విడుదల చేయాలనుకుంటున్నాడట మణిరత్నం. మరి భారీ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా మణిరత్నంకి ఎలాంటి ఫలితం అందిస్తుందో చూడాలి.